Keerthy Suresh: ఆ పాత్రలో నటించేందుకు చాలా భయమేసింది: కీర్తి సురేశ్

24 Mar, 2023 18:55 IST|Sakshi

సినీ అభిమానుల గుండెల్లో మహానటిగా పేరు సంపాదించుకుంది కీర్తి సురేశ్. ప్రస్తుతం నానితో కలిసి దసరా సినిమాతో అలరించేందుకు సిద్ధమైంది. అలాగే మూవీ ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీ అయిపోయారు కీర్తి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేశ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మహానటి చిత్రాన్ని అంగీకరించినందుకు తనపై చాలా ట్రోల్స్‌ వచ్చాయని గుర్తు చేశారు. అయితే ఆ సినిమా పూర్తయ్యాకే ఈ  విషయం తనకు తెలిసిందన్నారు. తనపై వచ్చిన విమర్శలను పక్కన పెడితే సావిత్రమ్మ పాత్రలో నటించినందుకు చాలా గర్వంగా ఉందన్నారామె.

కీర్తి సురేశ్ మాట్లాడుతూ..' మహానటిలో నటించేందుకు మొదట విముఖత వ్యక్తం చేశా.సావిత్రమ్మ పాత్రలో నటించేందుకు చాలా భయమేసింది. కానీ.. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నన్ను ప్రోత్సహించారు.  నువ్వు చేయగలవు అనే ధైర్యనిచ్చారాయన. ఆయనకే అంత నమ్మకం ఉంటే.. నేను ఎందుకు భయపడాలి అనుకున్నా. అలానే మహానటి ప్రాజెక్ట్‌ పూర్తి చేశా. ఆ పాత్రలో నటిస్తున్నందుకు  కొంతమంది నన్ను ట్రోల్‌ చేశారు. ఆ విషయం నాకు తెలియదు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్నప్పుడు దీనిపై ప్రశ్న ఎదురైంది. అప్పుడు తెలిసింది నాపై ట్రోల్స్ వచ్చాయని. సోషల్‌మీడియాలో నెగెటివిటీపై పెద్దగా ఆసక్తి చూపను. అందుకే నాపై ట్రోల్స్, విమర్శలు రావు. సావిత్రమ్మకు బయోపిక్‌లో నటించడం భయంగా అనిపించింది. ఆమె కుమార్తెతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. ఎన్నో సవాళ్లు ఎదురైనా కూడా ఆ పాత్ర చేసినందుకు గర్వపడుతున్నా' అని అన్నారు. 

నాని, కీర్తి సురేశ్ జంటగా దసరా చిత్రానికి శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కీర్తి వెన్నెల అనే గ్రామీణ యువతి పాత్రలో నటించారు. ఈ మువీ మార్చి 30న ఇది పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
 

మరిన్ని వార్తలు