Keerthy suresh: ఇదో అద్భుతమైన అనుభవం

25 Nov, 2022 07:33 IST|Sakshi
పూర్వీకుల ఇంట్లో నటి కీర్తి సురేష్‌  

మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న యువ నటి కీర్తి సురేష్‌. అలా ఆదిలోనే నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత గ్లామర్‌ పాత్రలపై దృష్టి సారించింది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు పొందిన కీర్తి సురేష్‌కు ప్రస్తుతం క్రేజ్‌ తగ్గిందనే మాట వినిపిస్తోంది. అవకాశాలు కూడా తగ్గుతున్నాయి.

తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటిస్తున్న మా మనిదన్‌ చిత్రం షూటింగ్‌ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం జయం రవి సరసన సైరన్‌ అనే చిత్రం మాత్రమే చేతిలో ఉంది. కెరీర్‌ పరంగా ఆమె పరిస్థితి ఇలా ఉంటే వ్యక్తి గతంగా మాత్రం కీర్తి సురేష్‌ బాగా ఎంజాయ్‌ చేస్తోంది. ఇటీవల ఈ తరం నటీమణులు పేరుతో పార్టీని నిర్వహించి ఆటా, పాట, విందు, వినోదాలతో సందడి చేసింది. ఇప్పుడు తన పూర్వీకుల గ్రామానికి వెళ్లి వార్తల్లో నిలిచింది.

చదవండి: (Mani Shankar: రిలీజ్‌కు రెడీ అవుతున్న సంజనా గల్రానీ 'మణిశంకర్‌')

కీర్తి సురేష్‌ తండ్రి సురేష్‌ మలయాళీ కాగా ఆమె తల్లి నటి మేనక తమిళం అన్నది తెలిసిందే. ఈమె ఇప్పటికీ తిరునెల్వేలి జిల్లా తిరుక్కట్రంకుడి గ్రామంలో నివసిస్తున్నారు. దీంతో నటి కీర్తి సురేష్‌ ఇటీవల అనూహ్యంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ గ్రామానికి వెళ్లింది. అక్కడ తన పూర్వీకుల ఇంటిని సందర్శించి, ఆ ఇంట్లో నేలపై కూర్చుని బంధువులతో ముచ్చటించింది.

అనంతరం ఆ ప్రాంతంలో 8వ దశాబ్ధంలో కట్టిన నంబిపెరుమాళ్‌ ప్రాచీన దేవాలయాన్ని సందర్శించి, విశేష పూజలను చేసింది. అక్కడ దిగిన ఫొటోలను తన ఇన్‌ స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసి 8వ శతాబ్ధంలో నిర్మించిన ప్రాచీన దేవాలయాన్ని సందర్శించడం అద్భుతమైన అనుభవం అని పేర్కొంది. ఆ ఆలయ శిల్పకళలను చూసి ఎంతో తన్మయత్వం చెందానని, మనసుకు చాలా ప్రశాంతత కలిగిందని, ఇదో అనిర్వచనీయమైన అనుభూతి అని పేర్కొంది. 

మరిన్ని వార్తలు