Ashwini Dutt: 'కీర్తిసురేష్‌ ఫస్ట్‌ ఛాయిస్‌ కాదు'.. అసలు విషయం చెప్పిన నిర్మాత

16 Aug, 2022 14:03 IST|Sakshi

దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేష్‌ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమానే కీర్తికి స్టార్‌ హీరోయిన్‌ అన్న ఇమేజ్‌ను తీసుకొచ్చింది. ఓవర్‌ నైట్‌ స్టార్‌డమ్‌తో కీర్తి కెరీర్‌లో ది బెస్ట్‌ మూవీగా నిలిచిందీ సినిమా. మహానటి సావిత్రి పాత్రలో కీర్తి నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ అవార్డు కూడా దక్కింది.

అయితే ఈ ప్రాజెక్ట్‌ కీర్తి సురేష్‌కి ముందు వేరే హీరోయిన్‌ దగ్గరికి వెళ్లిందట. ఈ విషయాన్ని స్వయంగా వైజయంతీ మూవీస్‌  అధినేత, ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్‌ వెల్లడించారు. ఓ ప్రముఖ షోలో పాల్గొన్న ఆయన మహానటి ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్టింగ్‌ విషయాలను షేర్‌ చేసుకున్నారు. ఈ సినిమాకు కీర్తికి ముందు ఓ మలయాళ నటిని అనుకున్నాం. కానీ కథ చెప్పాక అందులో మద్యం తాగే సన్నివేశాలు ఉంటే నేను చేయను అంటూ కండిషన్స్‌ పెట్టింది.

దీంతో ఆమెను తీసుకోవడానికి వీల్లేదు అని నేనే డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌కు చెప్పాను. కట్‌ చేస్తే కీర్తి సురేష్‌ చేతుల్లోకి ఈ సినిమా వెళ్లింది అంటూ చెప్పుకొచ్చారు. ఆ హీరోయిన్‌ పేరు చెప్పడానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు.అయితే మహానటి ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేసినప్పుడే మలయాళ హీరోయిన్‌ నిత్యామీనన్‌ పేరు తెరపైకి వచ్చింది. అంతేకాకుండా సావిత్రి పాత్రలో ఆమె ఫోటోలు కూడా కొన్ని బయటికొచ్చాయి. ఏది ఏమైనా నిత్యామీనన్‌ ఓ మంచి సినిమాను దూరం చేసుకుందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు