తిరువనంతపురం : కేరళ హైకోర్టులో బాలీవుడ్ నటి సన్నీ లియోన్కు భారీ ఊరట లభించింది. చీటింగ్ కేసులో ఆమెను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 2019లో కొచ్చిలో జరిగిన వేలంటైన్స్ డే ఫంక్షన్లో పాల్గొంటానని సన్నీలియోన్ రూ. 29 లక్షలు తీసుకున్నారని, కానీ రాలేదంటూ ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆమెపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈవెంట్ కంపెనీ ఫిర్యాదు మేరకు సన్నీలియోన్పై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసిన పోలీసులు..ఇటీవల తిరువనంతపురంలో టీవీ షో కోసమని వచ్చిన సన్నీ లియోన్ను ప్రశ్నించి వాంగ్మూలం తీసుకున్నారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను బాలీవుడ్ బ్యూటీ ఖండించింది. ఈ కేసుపై ఆమె మంగళవారం కేరళ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కేరళ హైకోర్టు.. సన్నీలియోన్ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. ముందుగా సన్నీలియోన్కు నోటీసులు ఇవ్వాలని సూచించింది.