‘ది కేరళ స్టోరీ’: నర్సు కావాలనుకున్న ఆమె టెర్రరిస్ట్‌గా ఎలా మారింది?

5 Nov, 2022 14:00 IST|Sakshi

‘‘ఆమె నర్సు కావాలని కలలు కనేది. కానీ కిడ్నాప్‌కి గురవుతుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఆఫ్ఘనిస్తాన్‌లోని జైలులో ఉగ్రవాదిగా ఉంది’’ అంటూ కన్నీటి పర్యంతమవుతూ తన కథ చెప్పింది షాలినీ ఉన్నికృష్ణన్‌. ‘ది కేరళ స్టోరీ’ చిత్రం ట్రైలర్‌లోని కథ ఇది. షాలినీ ఉన్నికృష్ణన్‌ని ‘ఫాతిమా’గా మార్చి, ఐఎస్‌ఐ తీవ్రవాదిగా ఎలా తయారుచేశారని కూడా ఈ టీజర్‌లో షాలినీ పేర్కొంది.

ఈ పాత్రను అదా శర్మ చేస్తుండగా, సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.‘‘ఈ సినిమా కోసం సుదీప్తో నాలుగేళ్లు పరిశోధించారు. ఆయన చెప్పిన ఘటనలు విని, కన్నీళ్లు ఆగలేదు. అప్పుడే ఈ సినిమా నిర్మించాలని నిర్ణయించేసుకున్నాను. వాస్తవ ఘటనలను చూపించనున్నాం’’ అన్నారు చిత్రనిర్మాత విపుల్‌ అమృత్‌లాల్‌ షా.

కేరళలో అపహరణకు గురైన 32వేల మంది (యూనిట్‌ పేర్కొన్న లెక్క) మహిళల మత మార్పిడి, ఉగ్రవాదులుగా మార్చడం తదితర అంశాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఈ చిత్రం టీజర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు