కేజీయఫ్‌ కాంబినేషన్‌లో ప్రభాస్‌ ప్యాన్‌ ఇండియా

1 Dec, 2020 00:44 IST|Sakshi

ప్రభాస్‌ ప్రస్తుతం ప్యాన్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌. ‘బాహుబలి’తో భారతీయ ప్రేక్షకులందరికీ నచ్చేశాడు. ఇప్పుడు ప్రభాస్‌ సినిమా చూడాలని ప్రతీ ప్రాంతానికి చెందిన ప్రేక్షకులు కోరుకుంటున్నారు. దీంతో ప్రభాస్‌ ప్యాన్‌ ఇండియన్‌ కథల్నే ఎంచుకుంటున్నారు. ఆల్రెడీ చేస్తున్న ‘రాధే శ్యామ్‌’, చేయబోయే ‘ఆదిపురుష్‌’, నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయేవి కూడా ప్యాన్‌ ఇండియా సినిమాలే. ఇప్పుడు మరో సినిమా ప్రకటించడానికి రెడీ అయ్యారని తెలిసింది. ఈ ప్రాజెక్ట్‌ను డిసెంబర్‌ 2న ప్రకటించనున్నారని తెలిసింది.

‘కేజీయఫ్‌’ను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తున్నట్టు సోమవారం పేర్కొంది. ఇది ప్రభాస్‌ – ప్రశాంత్‌ నీల్‌ సినిమాయే అని టాక్‌. హోంబలే ఫిల్మ్స్‌ అధినేత విజయ్‌ కిరగందూర్‌ మాట్లాడుతూ– ‘‘మేం ప్రస్తుతం చేస్తున్న ‘కేజీయఫ్‌ 2’ మీద చాలా అంచనాలు ఉన్నాయని తెలుసు. వాటన్నింటినీ మించేలా ఈ సినిమా ఉంటుంది. అలానే మా తదుపరి సినిమా కూడా ప్యాన్‌ ఇండియన్‌ సినిమాయే. డిసెంబర్‌ 2న 2 గంటల 9 నిమిషాలకు ఈ సినిమాని ప్రకటిస్తాం’’ అన్నారు. దాంతో ఇది ప్రభాస్‌–ప్రశాంత్‌ నీల్‌ సినిమా అనే చర్చలు మొదలయ్యాయి. మరి.. ఇది నిజమా? కాదా? అనేది ఒక్క రోజులో తెలిసిపోతుంది.

మరిన్ని వార్తలు