ఇక్కడ ఫెయిలైతే తర్వాత ఏంటి? ప్లాన్‌ బి కూడా లేదు!

1 Jul, 2021 00:22 IST|Sakshi

ఒక ప్లాన్‌ ఫెయిలైతే ఇంకో ప్లాన్‌ ఉండాలి. ప్లాన్‌ ఎ గురించి ఆలోచించినప్పుడే ప్లాన్‌ బీని కూడా ప్లాన్‌ చేయాలంటారు. అయితే కొందరు మాత్రం ‘ప్లాన్‌ ఎ’కే ఫిక్స్‌ అవుతారు. అలాంటివారిలో కియారా అద్వానీ ఒకరు. తెలుగులో ‘భరత్‌ అనే నేను’, హిందీలో ‘కభీర్‌ సింగ్‌’ విజయాలు చూడకముందు ఈ బ్యూటీ ఓ పరాజయాన్ని చవిచూశారు. అది కూడా తొలి సినిమాకే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయం గురించి కియారా మాట్లాడుతూ – ‘‘హీరోయిన్‌గా ‘ఫగ్లీ’ నా మొదటి సినిమా. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. ఇక్కడ ఫెయిలైతే తర్వాత ఏంటి? అని నేను ప్లాన్‌ బి కూడా ఆలోచించి పెట్టుకోలేదు.

అందుకే సినిమాలను వదిలి వెనక్కి వెళ్లాలనుకోలేదు. ప్రతి శుక్రవారానికి లెక్కలు మారిపోతాయని అర్థమైంది. అంతే.. నాకు నేను ధైర్యం చెప్పుకుని కష్టపడటం మొదలుపెట్టాను. విజయాలు అందుకున్నాను. కాకపోతే ఎన్ని విజయాలు అందుకున్నా కథానాయికగా నాకు పునాది వేసిన ‘ఫగ్లీ’ నాకెప్పటికీ ప్రత్యేకమే. ఇక ఆ తర్వాత చేసిన సినిమాల్లో విజయం సాధించినవి ఉండొచ్చు.. అపజయాలూ ఉండొచ్చు. అవి కూడా నాకు స్పెషలే’’ అన్నారు. ప్రస్తుతం హిందీలో మూడు సినిమాలు చేస్తున్న కియారా త్వరలో తెలుగులో రెండు భారీ చిత్రాలకు సైన్‌ చేయనున్నారని టాక్‌.

మరిన్ని వార్తలు