Kichcha Sudeep: కోలీవుడ్‌లో పాన్‌ ఇండియా మూవీతో ఎంట్రీ ఇస్తున్న కిచ్చా సుదీప్‌

26 May, 2023 08:11 IST|Sakshi

భారీ చిత్రాల నిర్మాత కలైపులి ఎస్‌ థాను. ఈయన ఇటీవల నటుడు ధనుష్‌ కథానాయకుడిగా వరుసగా అసురన్‌, కర్ణన్‌, నానే వరువేన్‌ చిత్రాలు నిర్మించారు. అందులో అసురన్‌, కర్ణన్‌ చిత్రాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. నానే వరువేన్‌ చిత్రం మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కాగా తాజాగా కలైపులి ఎస్‌. థాను తాజాగా తన వి.క్రియేషన్స్‌ పతాకంపై ఒక పాన్‌ ఇండియా చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ కథానాయకుడిగా నటించనున్నారు.

ఈయన ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి తమిళ ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. అదే విధంగా కిచ్చా సుదీప్‌ కథానాయకుడిగా నటించిన కన్నడ చిత్రం విక్రాంత్‌ రోణా చిత్రం తమిళంలోనూ మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో ఈయన ఇప్పుడు నేరుగా తమిళ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఈయన నటిస్తున్న 46వ చిత్రం అవుతుంది.

ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర వర్గాలు బుధవారం వెల్లడించారు. చిత్ర షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు అందులో పేర్కొన్నారు. అంతకు ముందుగా చిత్ర టీజర్‌ విడుదల చేయనట్లు నిర్మాతలు పేర్కొన్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు, కథానాయకి, ఇతర నటీనటులు సాంకేతిక వర్గం వివరాలు వెలువడాల్సి ఉంది.

అయితే వెల్‌ కమ్‌ టూ బాద్‌ షా అంటూ నిర్మాత బుధవారం నటుడు కిచ్చా సుదీప్‌ను స్వాగతిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. కాగా నటుడు సూర్య కథానాయకుడిగా వెట్రిమారన్‌ దర్శకత్వంలో వాడివాసల్‌ అనే భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు నిర్మాత ధాను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఆ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు