kirrak RP:కర్రీ పాయింట్‌ పెట్టుకున్న కమెడియన్‌, కుదిరితే మరో 15 బ్రాంచ్‌లు..

11 Dec, 2022 19:51 IST|Sakshi

బుల్లితెర కామెడీ షోలో స్కిట్లు చేస్తూ కడుపుబ్బా నవ్వించే కమెడియన్‌ కిరాక్‌ ఆర్పీ. జబర్దస్త్‌ షోలో ఎన్నో వందల స్కిట్లు చేసిన ఆర్పీ తర్వాత ఆ షో నుంచి బయటకు వచ్చేశాడు. నాగబాబు జడ్జిగా వ్యవహరించిన కామెడీ స్టార్స్‌ షోలో ప్రత్యక్షమై అందరికీ నవ్వులు పంచాడు. ఇటీవలే తాను ప్రేమించిన అమ్మాయిని నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి రెడీ అవుతున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా అతడు కర్రీ పాయింట్‌ బిజినెస్‌ మొదలుపెట్టాడు. పదేళ్ల కిందటే దీన్ని ప్రారంభించాలనుకున్న అతడు ఎట్టకేలకు అనుకున్నది సాధించాడు. కిరాక్‌ ఆర్పీ స్వస్థలం నెల్లూరు కాగా అక్కడ చేసే చేపల పులుసు అంటే తనకే కాకుండా మరెంతోమందికి ఇష్టమని గ్రహించాడు. తాను చేసే నెల్లూరు చేపల పులుసును మిత్రులు లొట్టలేసుకుని మరీ ఆరగించేవారట. అందుకే అలాంటి నెల్లూరు చేపల పులుసును హైదరాబాద్‌ వాసులకు అందజేయాలని భావించినట్లు తెలిపాడు.

అందులో భాగంగానే కూకట్‌పల్లిలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్‌ను ప్రారంభించాడు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే.. చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, కొరమీను పులుసు, సన్నచేపల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు.. ఇలా అన్నీ కట్టెలపొయ్యి మీదనే వండుతారట. అన్నీ కలిసొస్తే నెల్లూరు చేపల పులుసు కర్రీ పాయింట్స్‌ 15 బ్రాంచులు ఓపెన్‌ చేస్తానంటున్నాడు ఆర్పీ.

చదవండి: పుష్ప 2 డైలాగ్‌ లీక్‌

మరిన్ని వార్తలు