Kiran Abbavaram: డబ్బులిచ్చి మరీ ట్రోలింగ్‌ చేయిస్తున్నారు, నన్ను ఇంటికి పంపించేయాలనుకున్నా నేను వెళ్లను

22 Feb, 2023 14:35 IST|Sakshi

యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా నటించిన చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. మురళీ కిషోర్‌ అబ్బురు దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకుంది. ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ మంగళవారం ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో కిరణ్‌ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఈ సినిమాకు ప్రతిఒక్కరూ బాగా సపోర్ట్‌ చేశారు. కానీ కొన్ని బ్యాచులు తయారవుతున్నాయి. ట్విటర్‌లో నాపై కావాలని విషం చిమ్ముతున్నారు. ఇంతకుముందు చేసిన ఒకటీరెండు సినిమాలు బాలేవు, నన్ను విమర్శించారు. ఈ సారి ఎలాంటి విమర్శ రాకూడదని పకడ్బందీగా ప్లాన్‌ చేసి మంచి మంచి సీన్లు పెట్టాం. అయినా కూడా కొంతమంది సినిమా బాలేదంటున్నారు బ్రో అని మావాళ్లు కొన్ని మెసేజ్‌లను నాకు చూపిస్తున్నారు. అసలు ఎవరంటున్నారు? ఎందుకు బాలేదంటున్నారు అని వివరాలు ఆరా తీస్తే వాళ్లసలు ఇక్కడివాళ్లే కాదు.

ఎవరో కొందరు ఎవడికో రూ.50,000 ఇస్తే బాలేదని వరుస కామెంట్లు చేస్తున్నారు. ఇలాగైతే మాలాంటి యంగ్‌ హీరోలు ఎలా ఎదుగుతారు? మీరు నన్ను ఇంటికి పంపించేయాలనుకున్నా నేను వెళ్లను. ఇదే ఇండస్ట్రీలో ఉంటా. రూ.70,000 ఉద్యోగం వదిలేసి ఇక్కడిదాకా వచ్చా. నన్ను కిందకు లాగినా నాకేం పోదు. ట్విటర్‌ ఉంది కదా అని పొద్దున లేచినప్పటి నుంచి బూతు పురాణం ఎందుకు మొదలుపెడుతున్నారు? పక్కవాళ్ల మీద పడి ఏడవడం మానేయండి' అని ఓరకంగా వార్నింగ్‌ ఇచ్చాడు కిరణ్‌.

చదవండి: సినీ పరిశ్రమలో విషాదం

మరిన్ని వార్తలు