Sebastian PC 524: మా అన్నకు అంకితం ఇస్తున్నా: కిరణ్‌ అబ్బవరం 

3 Mar, 2022 10:50 IST|Sakshi

‘‘చిత్తూరు, మదన పల్లి నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్‌ బస్టర్‌ అవుతాయి. ఈ మధ్య వచ్చిన అల్లు అర్జున్‌ ‘పుష్ప’ కూడా గొప్ప విజయం సాధించింది. మదనపల్లి నేపథ్యంలో వస్తున్న ‘సెబాస్టియన్‌’ కూడా గొప్ప హిట్‌ అవుతుంది’’ అని నిర్మాత రవిశంకర్‌ అన్నారు. కిరణ్‌ అబ్బవరం హీరోగా, నువేక్ష (నమ్రతా దారేకర్‌), కోమలి ప్రసాద్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సెబాస్టియన్‌ పీసీ 524’. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో బి. సిద్ధారెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది.

ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథిలుగా దర్శకులు వెంకీ కుడుముల, వేణు శ్రీరామ్, మైత్రీ మూవీ మేకర్స్‌ చెర్రీ, నటుడు సాయికుమార్, హీరోలు అడివి శేష్, ఆకాష్‌ పూరి తదితరులు పాల్గొని, సినిమా సక్సెస్‌ సాధించాలని అన్నారు. బాలాజీ సయ్యపురెడ్డి మాట్లాడుతూ– ‘‘సెబాస్టియన్‌’ ట్రైలర్‌ ఎంత బాగుందో సినిమా అంతకు మించి బాగుంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమాను అందరూ ఆదరించాలి’’ అన్నారు సిద్ధారెడ్డి. ‘‘ఎక్కడో ఊర్లో టికెట్‌ కొనుక్కుని సినిమా చూసే నన్ను హీరోని చేసి వెళ్లిపోయిన మా అన్న రామాంజనేయులు రెడ్డికి ‘సెబాస్టియన్‌’ని అంకితం ఇస్తున్నాను’’ అన్నారు కిరణ్‌ అబ్బవరం. సహనిర్మాతలు ప్రమోద్, రాజు, జయచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు