నో అప్‌డేట్‌: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు దర్శకుడి షాక్‌

17 Feb, 2021 10:30 IST|Sakshi

అప్‌డేట్‌ మరోసారి ఆలస్యం

ప్రభాస్‌ అభిమానులకు సారీ చెప్పిన దర్శకుడు

నిరాశపడుతున్న అభిమానులు

బాహుబలి హీరో ప్రభాస్‌, మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ ప్రముఖులు దీపికా పదుకొనే హీరోయిన్‌గా బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా అప్‌డేట్‌ గురించి కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ప్రభాస్‌ అభిమానులు. 

సంక్రాంతి పండగ రోజు స్పెషల్‌ అప్‌డేట్‌ ఉంటుందని భరోసా ఇచ్చిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తీరా సమయానికి చేతులెత్తేశాడు. దీంతో షాకైన అభిమానులు అప్‌డేట్‌ ఎప్పుడిస్తారు? మాకు చెప్పాల్సిందేనంటూ వరుస ట్వీట్లు చేస్తూ సోషల్‌ మీడియాను ఆగం పట్టించారు. దీంతో మెట్టు దిగి వచ్చిన దర్శకుడు 'కచ్చితంగా చెప్పాలంటే జనవరి 29న లేదా ఫిబ్రవరి 26న మరొక అప్‌డేట్ రాబోతుంది' అని ఫ్యాన్స్‌ను శాంతింపజేశాడు. దీంతో అభిమానులు ఆ రోజు ఎప్పుడు వస్తుందా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఎలాంటి ట్రెండింగ్స్‌ చేపట్టాలో ఇప్పటి నుంచే ప్రణాళికలు వేస్తున్నారు. ఈ సమయంలో నాగ్‌ అశ్విన్‌ మరో చేదు వార్త చెప్పి ప్రభాస్‌ అభిమానులను నిరాశపర్చాడు. వచ్చే 26 తారీఖున ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వడం లేదని చెప్తూ ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పాడు.

కాగా ఈ చిత్రం మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సైన్స్‌ ఫిక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ప్రీ పొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ప్రభాస్‌ రాధేశ్యామ్‌ జూలై 30న, ఆదిపురుష్‌ వచ్చే ఏడాది ఆగస్టు 11న రిలీజవుతున్నాయి. ఆయన ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌ చేస్తున్న 'సలార్'‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. తర్వాత 'ఆదిపురుష్'‌, ఆ తర్వాత నాగ్‌ అశ్విన్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఇవన్నీ ప్యాన్‌ ఇండియా సినిమాలే కావడం విశేషం.

చదవండి:  కొన్ని కథలు ఇక్కడే చెప్పాలి!: దర్శకులు

>
మరిన్ని వార్తలు