Muthayya Movie: ముత్తయ్య ఖాతాలో మరో అవార్డు.. దర్శకనిర్మాతల హర్షం

25 Dec, 2022 17:18 IST|Sakshi

కె.సుధాకర్ రెడ్డి, అరుణ రాజ్, మౌనిక బొమ్మ, పూర్ణ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "ముత్తయ్య". ఈ చిత్రాన్ని హైలైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్ లిమిటెడ్, ఫిక్షనరీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు బ్యానర్లపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి, వ్రిందా ప్రసాద్ నిర్మించారు. భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. గతంలో యూకే ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన తొలి తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించిందీ చిత్రం. ఈ ఏడాది మే 9న లండన్‌లో రిచ్ మిక్స్‌లో ప్రీమియర్ అయ్యింది.

తాజాగా కోల్‌కతాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ భారతీయ చిత్రంగా అవార్డు అందుకుంది. కాంపిటేషన్ ఆన్ ది ఇండియన్ లాంగ్వేజ్ ఫిలింస్ కేటగిరీలో ఈ పురస్కారం దక్కింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంపై దర్శక నిర్మాతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత కేదార్ సెలగం శెట్టి మాట్లాడుతూ.. 'కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌(కేఐఎఫ్ఎఫ్)లో మా ముత్తయ్య సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిలిం అవార్డ్ దక్కడం గర్వంగా ఉంది. మా సినిమా మరింత మందికి స్ఫూర్తి పంచుతుందని ఆశిస్తున్నాం' అన్నారు.

నిర్మాత వ్రిందా ప్రసాద్ మాట్లాడుతూ... 'కేఐఎఫ్ఎఫ్ చిత్రోత్సవాల్లో మా సినిమా చూసిన ప్రతి ఒక్కరిలో ఓ మంచి చిత్రాన్ని చూశామనే సంతృప్తి కనిపించింది. ముత్తయ్యలోని కథా కథనాలే ప్రపంచవ్యాప్తంగా చిత్రోత్సవాల్లో ఆదరణ పొందేందుకు కారణంగా నిలుస్తున్నాయి' అన్నారు. దర్శకుడు భాస్కర్ మార్య మాట్లాడుతూ...'ఈ సినిమా తెరకెక్కించే ముందు ఇదొక కలగా ఉండేది. ఇప్పుడు ఊహించనన్ని ఆశ్చర్యాలను తీసుకొస్తోంది. ముత్తయ్య సినిమా మాకెంతో పేరు, గౌరవాన్ని అందిస్తోంది. ఒక దర్శకుడిగా ఇలాంటి గుర్తింపు దక్కడం మంచి సినిమాలు రూపొందించాలనే ఉత్సాహాన్ని పెంచుతోంది' అన్నారు.

చదవండి: ఆ డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకుందామనుకున్న చలపతిరావు
సీరియల్‌ నటి ఆత్మహత్య.. చివరి పోస్ట్‌ వైరల్‌

మరిన్ని వార్తలు