'సారంగదరియా నా పాట, కానీ నాతో పాడించలేదు'

7 Mar, 2021 13:53 IST|Sakshi

ప్రేక్షకుల టేస్ట్‌ మారింది. సినిమాలోని మాస్‌ సాంగ్స్‌ కన్నా యూట్యూబ్‌లో వచ్చే జానపదాలకే జై కొడుతున్నారు. ఫలితంగా లక్షలాది వ్యూస్‌తో జానపద పాటలు మరోసారి ప్రాణం పోసుకుంటున్నాయి. దీంతో వీటికి సినిమాల్లోనూ స్థానం కల్పిస్తున్నారు. అయితే మొదట పాడినవాళ్ల దగ్గర నుంచి అనుమతి తీసుకోవడమే కాక వారికి క్రెడిట్స్‌ ఇవ్వాల్సిందే. లేదంటే చిక్కులు తప్పవు. తాజాగా లవ్‌ స్టోరీ సినిమాలో సూపర్‌ డూపర్‌ హిట్టైన 'సారంగ దరియా..' పాట మీద కూడా ఇలాంటి వివాదమే మొదలైంది.

పల్లెల్లో ఉన్న ఈ పాటను వెలుగులోకి తీసుకొచ్చింది తానేనంటూ మీడియా ముందుకొచ్చింది కోమలి. అమ్మమ్మ దగ్గర నుంచి ఈ పాట నేర్చుకున్నాని, కానీ ప్రజలకు చేరువ చేసింది తాను కాబట్టి ఈ సాంగ్‌ తన సొంతమని చెప్తోంది. "రేలారే రేలా ప్రోగ్రాం సమయంలో సుద్దాల అశోక్‌తేజ నా పాట విన్నారు.  లవ్‌ స్టోరీలో ఈ పాటను వాడుకున్నారని తెలియగానే అశోక్‌ తేజకు ఫోన్‌ చేశాను. ఇది ఎవరి సొంతం కాదు, నువ్వు పుట్టకముందే ఈ పాట నా దగ్గరుంది అని చెప్పాడు. కానీ ఈ పాటను ఆయన ఎప్పుడూ వెలుగులోకి తీసుకురాలేదు. సినిమాలో ఈ పాట నాతో పాడించనందుకు బాధేసింది. నా బాధను చూసి నాకు నెక్స్ట్‌ సినిమాలో అవకాశం ఇస్తానని శేఖర్‌ కమ్ముల హామీ ఇచ్చారు. కానీ సారంగరదరియా నాతో ఎందుకు పాడించలేదు? ఎందుకు అవకాశమివ్వలేదు? ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు అనేదే నా బాధ" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. కాగా ఈ పాట సేకరించింది కోమలి అని సుద్దాల అశోక్‌ తేజ సైతం అంగీకరించాడు.

చదవండి: తస్సాదియ్యా! నాగచైతన్య సినిమాకు అంత బిజినెస్సా?

మరిన్ని వార్తలు