సినిమాలు తెలుగోడి దమ్ము చూపిస్తున్నాయి

16 Feb, 2021 00:57 IST|Sakshi
కృతీ శెట్టి, బుచ్చిబాబు, నవీన్, వైష్ణవ్‌ తేజ్, లగడపాటి శ్రీధర్‌

– లగడపాటి శ్రీధర్‌

‘‘రామానాయుడు, శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి, ఎమ్మెస్‌ రాజు, ‘దిల్‌’ రాజుగార్లు, మైత్రీ మూవీ మేకర్స్‌.. ఇలా వీరందరూ బాలీవుడ్, హాలీవుడ్‌ వారు సైతం తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా తెలుగు సినిమాను ఒక స్థాయికి తీసుకెళ్లారు. ఈ మధ్య మన సినిమాలు తెలుగోడి దమ్ము ఏంటో చూపిస్తున్నాయి’’ అన్నారు లగడపాటి శ్రీధర్‌. విక్రమ్‌ సహిదేవ్, సౌమిక పాండియన్, రిషికా ఖన్నా, వినీత్‌ భవిశెట్టి, స్నేహల్‌ కమల్, అభిజిత్‌ దేశ్‌ పాండే, జయశ్రీ రాచకొండ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కొత్తగా రెక్కలొచ్చెనా’. ఈ సినిమా ద్వారా నిర్మాత–నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య పెద్దబ్బాయి ప్రదీప్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

లగడపాటి శిరీష, లగడపాటి శ్రీధర్‌ నిర్మించిన  ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ యూనిట్‌కి లగడపాటి శ్రీధర్‌ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఇదే వేదికపై ‘కొత్తగా రెక్కలొచ్చెనా’ లోగోను ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత నవీన్‌  యర్నేని విడుదల చేయగా, ఫస్ట్‌ లుక్‌ను హీరోహీరోయిన్‌ వైష్ణవ్‌ తేజ్, కృతీ శెట్టి రిలీజ్‌ చేశారు. నవీన్‌  మాట్లాడుతూ– ‘‘ఉప్పెన’ కలెక్షన్స్‌ రోజురోజుకూ పెరుగుతున్నాయి. మాకు ఇంత విజయం అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘కొత్తగా రెక్కలొచ్చెనా’ మంచి విజయం సాధించాలి’’ అన్నారు బుచ్చిబాబు, వైష్ణవ్‌ తేజ్, కృతీ శెట్టి. ‘కొత్తగా రెక్కలొచ్చెనా’ చిత్రానికి క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: గోపీచంద్‌ లగడపాటి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రాఘవేంద్ర అన్న.

మరిన్ని వార్తలు