తెలుగు వెండితెరపై ‘ఉప్పెన’లా దూసుకొచ్చిన హీరోయిన్ కృతిశెట్టి. ఉప్పెన చిత్రంలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ.. పక్కింటి అమ్మాయిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులనే కాకుండా దర్శక నిర్మాతలను కూడా క్యూ కట్టేలా చేసింది. ‘ఉప్పెన’సినిమాకి ముందు కృతిశెట్టి అంటే ఎవరో తెలియలేదు. చైల్డ్ ఆర్టిస్ట్గా, మోడల్గా పలు యాడ్స్ తో ఓ మోస్తారు గుర్తింపు పొందింది కృతి శెట్టి. కానీ `ఉప్పెన` చిత్రంలో హీరోయిన్గా నటించాక ఆమె రేంజే మారిపోయింది.
ఒకే ఒక సినిమాతో కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరుగా కృతిశెట్టి స్థానం సంపాదించింది. ప్రస్తుతం కృతి నానితో `శ్యామ్ సింగరాయ్`, సుధీర్బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్ పోతినేనితో లింగుస్వామి చిత్రంలో నటిస్తుంది. అలాగే నితిన్తో ‘మాచర్ల నియోజకవర్గం’చిత్రంలోనూ ఆమే హీరోయిన్. మరోవైపు ఇటీవల `బంగార్రాజు`లో నాగచైతన్య సరసన హీరోయిన్గా ఎంపికైంది. ఇలా టాలీవుడ్లో తనకు వస్తున్న డిమాండ్ని దృష్టిపెట్టుకొని పారితోషికాన్ని అమాంతం పెంచిందట ఈ ‘బేబమ్మ’.
(చదవండి:హీరో ధనుష్ రెమ్యునరేషన్ ఎంత? ఎన్నికోట్ల ఆస్తి ఉంది?)
తొలి సినిమా ‘ఉప్పెన’ కోసం కేవలం రూ.6 లక్షలను మాత్రమే పారితోషికంగా తీసుకుందట కృతి. అయితే ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో దాదాపు 60 లక్షల వరకు గిఫ్ట్ రూపంలో అందించారట నిర్మాతలు. ఇక ఉప్పెన విడుదలకు ముందే ఒప్పుకున్న నాని ‘శ్యామ్ సింగరాయ్’కోసం దాదాపు రూ.20 లక్షలను పారితోషికంగా తీసుకుందట.
ఇక ఉప్పెన రిలీజై, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం, బేబమ్మగా కృతిశెట్టి తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వడంతో పారితోషికాన్ని అమాంతం పెంచేసిందట. ప్రస్తుతం కృతి నటిస్తున్న చిత్రాలకు గాను దాదాపు రూ.80 లక్షల వరకు పారితోషికంగా అందుకుంటుందట. అంతేకాదు ‘ఉప్పెన’హిందీ రీమేక్ చేసేందుకు ప్లాన్ జరుగుతోంది. అందులోనే కృతినే హీరోయిన్గా నటించబోతుదని వినికిడి. ఈ సినిమా కోసం ఏకంగా కోటి రూపాయలు ఆఫర్ చేశారట నిర్మాతలు. గతంలో జీ తెలుగులో ప్రసారమయ్యే ఓ సీరియల్ ప్రమోషన్ కోసం కూడా కృతి రూ. కోటి తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఒకే ఒక్క సినిమాలో నటించి, తర్వాతి సినిమాలకే రూ. కోటి వరకు పారితోషికంగా తీసుకున్న హీరోయిన్గా కృతి రికార్డుల్లోకి ఎక్కినట్లే.