సీత కోసం ఎదురుచూస్తున్నారు ‘ఆదిపురుష్’ చిత్రబృందం. ఆ ఎదురుచూపులకు తెరపడిందని బాలీవుడ్ టాక్. ప్రభాస్ హీరోగా ఓమ్ రౌత్ తెరకెక్కించనున్న భారీ పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపిస్తారు. సీత పాత్రను ఫలానా హీరోయిన్ చేయబోతోందని చాలామంది పేర్లు వినిపించాయి. అయితే సీత పాత్రకు కృతీ సనన్ కన్ఫర్మ్ అయ్యారన్నది తాజా బాలీవుడ్ టాక్. మహేశ్బాబు చేసిన ‘1: నేనొక్కడినే’, నాగచైతన్య ‘దోచేయ్’ సినిమాల్లో కృతీసనన్ హీరోయిన్గా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది.
ఆ తర్వాత హిందీ చిత్రాలకు పరిమితమయ్యారామె. దాదాపు గ్లామరస్ రోల్స్ చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ సీత పాత్రలో ఒదిగిపోవడానికి కసరత్తులు మొదలుపెట్టారని కూడా ఓ వార్త ఉంది. జనవరిలో ‘ఆది పురుష్’ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందులో రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ చేయబోతున్నారు. సుమారు 300 కోట్ల వ్యయంతో టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 2022 ఆగస్ట్ 11న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.