ఆ రోజు ఆటోలో కూర్చోని బాగా ఏడ్చాను: కృతి సనన్‌

29 Aug, 2021 20:53 IST|Sakshi

టాలీవుడ్‌లో ‘వన్‌.. నేనోక్కడినే’ తో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు సరసన జతకట్టింది కృతి సనన్‌. ఆ తర్వాత బాలీవుడ్‌కు మాకాం మార్చిన ఈ అమ్మడు అక్కడ బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. బీ టౌన్‌లో స్టార్‌ హీరోల సరసన నటిస్తూ ఈ భామ భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్‌ తీసుకుంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృతి తాను మోడలింగ్‌ చేస్తున్నప్పటి విషయాలను పంచుకుంది.

తన మొదటి ర్యాంప్‌ వ్యాక్‌ షోలో ఏదో పొరపాటు విషయమై కొరియోగ్రాఫర్‌ తన పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. ఆ షో ముగింపులో దాదాపు 20 మోడళ్ల ముందు ఆ కొరియోగ్రాఫర్‌ తనని తిట్టాడని చెప్పింది కృతి. ఆ తర్వాత తను ఆటోలో కూర్చుని ఆ విషయాన్ని తలుచుకుని ఏడవటం మొదలుపెట్టి.. అక్కడి నుంచి ఇంటికి వెళ్లి వాళ్ల అమ్మతో చెప్పి బాధపడినట్లు​ తెలిపింది. దీంతో ఆమె కృతిసనన్‌తో.. ఈ వృత్తిలో నువ్వు రాణించగలవో లేదో నాకు తెలీదు గానీ ముందు నువ్వు మానసికంగా మరింత బలంగా ఉండాలి. నీ మీద నీకు నమ్మకం ఉండాలంటూ ధైర్యం చెప్పిందని అప్పటి విషయాలని గుర్తుచేసుకుంది కృతి.

ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో బోలెడు సినిమాలు ఉన్నాయి. ఇటీవలే ఈ నటి బచ్చన్ పాండే షూటింగ్ పూర్తి చేసింది. ఇందులో అక్షయ్ కుమార్‌ సరసన నటించింది.  గణపత్‌లో టైగర్‌ ష్రాఫ్‌ సరసన నటిస్తుండగా, వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తున్న ‘భేదియా’ చిత్రం కోసం షూట్ కూడా చేసింది. ‘హమ్ దో హుమారే దో’ లో కూడా నటిస్తోంది.

చదవండి: Street Light Movie: పగలంతా పెద్ద మనుషులు, రాత్రి అయితే..?

మరిన్ని వార్తలు