Venu Madhav Mother: చేజేతులారా ప్రాణాలు తీసుకున్నాడు.. అసలు మాట వినలేదు: సావిత్రమ్మ ఆవేదన

31 Jan, 2023 18:03 IST|Sakshi

టాలీవుడ్‌లో ఎప్పటికి గుర్తుండిపోయే కమెడియన్‌ల్లో నటుడు వేణు మాధవ్‌ ఒకరు. ఖమ్మంలో పుట్టిన వేణు మాధవ్‌ మొదట మిమిక్రి అర్టిస్ట్‌గా చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన ఆయన అతి తక్కువ సమయంలోనే స్టార్‌ కమెడియన్‌గా ఎదిగారు. వెండితెరపై స్పెషల్‌ ఇమేజ్‌ని సొంతంగా చేసుకున్న ఆయన 2019లో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక వేణు మాధవ్‌ అనారోగ్యం, ఆయన గురించిన పలు ఆసక్తికర విషయాలను ఆయన తల్లి సావిత్రమ్మ తాజాగా ఓ ఇంటర్య్వూలో పంచుకున్నారు.

చదవండి: గంగోత్రికి ముందు బన్నీని అడగలేదు.. అన్నయ్య చెప్పడంతో..: నాగబాబు

రీసెంట్‌గా ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. వేణు మాధవ్‌ చనిపోయే నాటికి ఆయనకు రూ. 20 కోట్లపైనే ఆస్తులు ఉన్నాయని, అయినా తాను అద్దె ఇంట్లో ఉంటున్నానని చెప్పారు. ‘నాకు ముగ్గురు కొడుకులు. అందులో వేణు మాధవ్‌ చిన్నవాడు. చిన్నప్పటి నుంచి వాడు చురుగ్గా ఉండేవాడు. మిమిక్రీ బాగా చేస్తుండే వాడు. అలా మిమిక్రీ ఆర్టిస్ట్‌గా  ఓ ప్రోగ్రామ్‌ చేస్తున్నప్పుడు తనని ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిగారు చూసి వేణుకి మూవీ ఆఫర్‌ ఇచ్చారు. ఇక ఆ తర్వాత మంచి నటుడిగా ఎదిగాడు.

నటుడిగా కొడుకు ఎదుగుదల చూసి గర్వపడ్డాను. వేణు సినిమాలతో బిజీగా ఉండటంతో నా ఇద్దరు కొడుకులని తనకి అసిస్టెంట్‌గా పెట్టాను. కానీ ఇప్పుడు అలా ఎందుకు చేశానా అని బాధపడుతున్నా. చెప్పాలంటే నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే. వేణు ఎదిగాడు కానీ, వాళ్లీద్దరు ఎదగలేదు. ఒకవేళ వేణు ఉండి ఉంటే వాళ్లిద్దరిని బాగా చూసుకునేవాడేమో’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వేణు మాధవ్‌ చేజేతురాల తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు ఆమె. వేణుకి ఓ అలవాటు ఉందని, ఎప్పుడు ఏ జబ్బు చేసినా మందులు వేసుకునేవాడు కాదన్నారు.

చదవండి: అవతార్‌ 2ను వెనక్కిన నెట్టిన ఆర్‌ఆర్‌ఆర్‌, మరో అంతర్జాతీయ అవార్డుకు ఎన్నిక

‘తలనొప్పి వచ్చినా టాబ్లెట్ వేసుకునే  అలవాటు ఆయనకి లేదు.. అదే అతని  కొంపముంచింది. జాండిస్‌, డెంగ్యూ వ్యాధి వస్తే మందులు వాడకుండా నిర్లక్ష్యం చేసేవాడు. దాంతో పరిస్థితి విషమించి చనిపోయారు. అయితే వేణు చనిపోవడానికి నెల రోజుల ముందే నా పెద్ద కొడుకు కూడా చనిపోయాడు. ఇద్దరి కొడుకుల మరణం చూసి కృంగిపోయాను’ అంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక వేణు ఆస్తులు బాగానే సంపాదించాడని, ఏడెనిమిది ఫ్లాట్‌లతో పాటు దాదాపు  20 కోట్లకి పైగా ఆస్తులు ఉన్నాయన్నారు. వేణుకి ఇద్దరు కొడుకులని, వారు సొంత ఇంట్లో ఉంటున్నారని చెప్పారు. తాను మాత్రం తన మూడో కొడుకుతో అద్దె ఇంట్లోనే ఉంటున్నానని సావిత్రమ్మ చెప్పుకొచ్చారు.  

మరిన్ని వార్తలు