‘ఆదిపురుష్‌’ దర్శకుడు, విలన్‌పై కోర్టులో పిటిషన్‌

17 Dec, 2020 12:41 IST|Sakshi

లక్నో: ప్రభాస్‌ ‘ఆదిపురుష్’ చిత్రంపై‌ ఉత్తప్రదేశ్‌కు చెందిన ఓ లాయర్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఇందులో రావణుడి పాత్ర పోషిస్తున్న బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలను వెనకకు తీసుకుంటూ సైఫ్‌ క్షమాపణలు కూడా చెప్పారు. అయినప్పటికి ‘ఆదిపురుష్’‌ సినిమా దర్శకుడు ఓం రౌత్‌, సైఫ్‌పై యూపీకి చెందిన న్యాయవాది హిమాన్షు శ్రీవాస్తవ బుధవారం జౌన్‌పూర్‌ కోర్టులో పిల్‌ వేశాడు. రావణుడిపై సైఫ్‌ అలీ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు హిందూ మత విశ్వసాలను దెబ్బ తీసేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. సైఫ్‌ అలీఖాన్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్‌ పేరును కూడా పిటిషన్‌లో చేర్చారు. ఇందులో రాముడిగా ప్రభాష్‌, రావణుడిగా సైఫ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సైఫ్‌ ఇటీవల ఓ ఇంటర్యూలో సినిమా గురించి మాట్లాడారు. (చదవండి: జనవరిలో ‘ఆది పురుష్’‌‌ షూటింగ్‌ ప్రారంభం!)

‘ఈ సినిమాలో రావణ పాత్ర చేయడం చాలా ఆసక్తికరంగా ఉంది. రావణుడు సీతను ఎందుకు అపహరించాడు. శ్రీ రాముడితో రావణుడు యుద్ధం చేయడం న్యాయమేనన్నాడు. అయితే రాముడితో ఎందుకు యుద్దం చేశాడనే కోణంలో సినిమా ఉండబోతుంది. రావణాసురుడిలోని మానవత్వ కోణాన్ని కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సైఫ్‌ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వివాదస్పదంగా మారాయి. హిందువులు రాక్షసుడిగా భావించే రావణాసురుడిని పోగుడూతూ చేసిన ఆయన వ్యాఖ్యలపై పలు హిందు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో సైఫ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్రోల్స్‌ చేయడంతో అతడు‌ క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ పలువురు ఈ వ్యాఖ్యలను ఇప్పటికి ఖండిస్తుండటంతో ఈ వివాదం తరచూ తెరపై నిలుస్తోంది. (చదవండి: ప్రభాస్‌ మూవీపై కామెంట్‌.. సారీ చెప్పిన సైఫ్‌ అలీఖాన్‌)

మరిన్ని వార్తలు