Tollywood Reentry: బ్రేక్‌కి బ్రేక్‌.. రీ ఎంట్రీ ఇస్తున్న అలనాటి తారలు

7 May, 2022 08:08 IST|Sakshi

సిల్వర్‌ స్క్రీన్‌ ఎప్పుడు ఆనందపడుతుంది? తన అభిమాన తార సినిమా తెరకు వచ్చినప్పుడు. 
సిల్వర్‌ స్క్రీన్‌ ఎప్పుడు బాధపడుతుంది... తన అభిమాన తార సినిమాలకు బ్రేక్‌ ఇచ్చినప్పుడు. 
ఆ బ్రేక్‌కి బ్రేక్‌ ఇచ్చి ఆ తారలు మళ్లీ సినిమాలు చేస్తే.. 
రండి.. రండి.. రండి.. మీ రాక ఎంతో ఆనందమండి అని వెండితెర ఆహ్వానించకుండా ఉంటుందా. 
ఇక కొందరు తారలు బ్రేక్‌ తర్వాత చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. 

28 ఏళ్ల తర్వాత... 
బ్యాక్‌ టు బ్యాక్‌ జాతీయ ఉత్తమ నటిగా (తమిళ చిత్రం ‘వీడు’– 1987, తెలుగు చిత్రం ‘దాసి’– 1988 చిత్రాల్లోని నటనకు) అవార్డులు సాధించిన అర్చన ప్రేక్షకులకు గుర్తుండే ఉంటారు. ‘నిరీక్షణ’, ‘లేడీస్‌ టైలర్‌’, ‘భారత్‌ బంద్‌’ వంటి తెలుగు చిత్రాల్లో అర్చన యాక్టింగ్‌ అదుర్స్‌ అని అప్పట్లో తెలుగు ప్రేక్షకులు కితాబులిచ్చారు. అర్చన కేవలం తెలుగులోనే కాదు.. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లోనూ సినిమాలు చేశారు.

అయితే మిగతా భాషల్లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నా తెలుగు తెరపై నల్లపూస అయిపోయారు అర్చన. 1994లో వచ్చిన ‘పచ్చతోరణం’ తర్వాత మరో తెలుగు మూవీలో ఆమె కనిపించలేదు. ఇప్పుడు అర్చన మళ్లీ తెలుగు డైలాగ్స్‌ చెబుతున్నారు. ఈ డైలాగ్స్‌ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న ‘చోర్‌ బజార్‌’ చిత్రం కోసమే. జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాశ్‌ తల్లిగా కనిపిస్తారు అర్చన. ఈ ఏడాదే ‘చోర్‌ బజార్‌’ చిత్రం థియేటర్స్‌కు రానున్నట్లుగా తెలిసింది. అంటే.. దాదాపు 28 సంవత్సరాల తర్వాత అర్చన మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారన్నమాట. 


 
తమిళంలో ఇరవై.. తెలుగులో పది 
తెలుగులో ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచిన ‘శివ’లో హీరోయిన్‌గా చేసిన అమలను అంత ఈజీగా మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు. అయితే 1993లో ‘ఆగ్రహం’ తర్వాత అమల తెలుగు సినిమాకు గ్యాప్‌ ఇచ్చారు. తిరిగి 2012లో ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ చిత్రం ద్వారా తెలుగు తెరపై కనిపించారు. అయితే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా.. ఆ తర్వాత ‘మనం’ (2014) చిత్రంలో అతిథిగా కనిపించినప్పటికీ ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌ చేసింది మాత్రం తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’) లోనే అని చెప్పాలి. శ్రీ కార్తీక్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ ద్విభాషా (తెలుగు, తమిళ) చిత్రంలో శర్వానంద్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులో శర్వా తల్లి పాత్రలో కనిపిస్తారు అమల. దాదాపు పదేళ్ల తర్వాత తెలుగులో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో అమల కనిపించనున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఇక తమిళంలో 1991లో వచ్చిన ‘కర్పూర ముల్లై’ తర్వాత అమల మరో సినిమా చేయలేదు. ఇరవైసంవత్సరాల తర్వాత ‘కణం’ సినిమాతో తమిళ తెరపై ఆమె మళ్లీ కనిపించనున్నారు.  

 రెండు దశాబ్దాలకు మళ్లీ... 
‘బద్రి, జానీ’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన రేణూ దేశాయ్‌ ప్రేక్షకులకు  సుపరిచితురాలే. 2003లో వచ్చిన ‘జానీ’ తర్వాత తెలుగులో ఆమె మరో చిత్రం చేయలేదు. 2014లో మరాఠీ చిత్రం ‘ఇష్క్‌ వాలా లవ్‌’కి దర్శకత్వం వహించారు కానీ నటిగా వెండితెరపై మాత్రం మెరవలేదు. ఇప్పుడు కనిపించనున్నారు. రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’లో ఓ కీ రోల్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారామె. ఈ సినిమాకు వంశీ దర్శకుడు. ఆల్రెడీ షూటింగ్‌ మొదలైంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజయ్యే చాన్స్‌ ఉంది. 

పదేళ్ల తర్వాత.
‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’... ఈ డైలాగ్‌ విన్న వెంటనే జెనీలియా గుర్తు రాకుండా ఉండరు. 2012లో వచ్చిన ‘నా ఇష్టం’ సినిమా తర్వాత జెనీలియా మరో తెలుగు సినిమా సైన్‌ చేయలేదు. ఇటీవలే ఆమె ఒక తెలుగు చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కిరీటి (వ్యాపారవేత్త గాలి జనార్ధన్‌ రెడ్డి కుమారుడు) హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో జెనీలియా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. దాదాపు పదేళ్ల  తర్వాత జెనీలియా తెలుగు సినిమావైపు చూశారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ద్విభాషా (తెలుగు, కన్నడం) చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల మొదలైంది.  

డబుల్‌ ధమాకా 
‘గోల్కొండ హైస్కూల్‌’, ‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ‘కలర్స్‌’ స్వాతి ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2017లో వచి్చన ‘లండన్‌ బాబులు’ తర్వాత ఈ బ్యూటీ తెలుగులో మరో సినిమా చేయలేదు. దాదాపు ఐదేళ్ల  తర్వాత తెలుగులో ఆంథాలజీ ఫిల్మ్‌ ‘పంచతంత్రం’ అంగీకరించారు. అలాగే ఈ సినిమాతో పాటు స్వాతి ‘ఇడియట్స్‌’ అనే ఫిల్మ్‌ కూడా చేశారు. స్వాతి, నిఖిల్‌ దేవాదుల, సిద్ధార్థ్‌ శర్మ, శ్రీ హర్ష ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఆదిత్యా హాసన్‌ దర్శకుడు. అభిõÙక్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్‌ చేశారు. ఈ చిత్రానికి నవీన్‌ మేడారం షో రన్నర్‌. ఇలా కమ్‌బ్యాక్‌లోనే ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ డబుల్‌ ధమాకా ఇస్తున్నారు స్వాతి. 

 వీరే కాదండోయ్‌... ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సోనాలీ బింద్రే, రామ్‌ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో మీరా జాస్మిన్‌ కీ రోల్స్‌ చేయడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా తెలుగు సినిమాల పరంగా బ్రేక్‌లో ఉన్న మరికొందరు తారలు కూడా రీ ఎంట్రీ లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు