MAA Elections 2021: 'మా' సభ్యుల బాధలు తెలుసన్న మంచు విష్ణు

27 Jun, 2021 11:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: 'మా' అధ్యక్ష బరిలోకి దిగుతున్నట్లు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించాడు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో నామినేషన్ వేస్తుండటం గౌరవప్రదంగా భావిస్తున్నానని తెలిపాడు. 'మా' కుటుంబ సభ్యుల బాధలు తనకు బాగా తెలుసన్న ఈ హీరో మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందామని పిలుపునిచ్చాడు. 

తనకు, తన కుటుంబానికి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన తెలుగు సినీ పరిశ్రమకు ఎంతో రుణపడి ఉన్నానని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా ఈ ఇండస్ట్రీకి సేవ చేయడమే తన కర్తవ్యమన్నాడు. తండ్రి మోహన్‌బాబు 'మా' అసోసియేషన్‌ కోసం చేసిన సేవలే తనకు ఆదర్శమని చెప్పుకొచ్చాడు. దీనికి తోడు గతంలో 'మా' ఎగ్జిక్యూటివ్‌ వైస్ ప్రెసిడెంట్‌గా పని చేసిన అనుభవం కూడా ఉందన్నాడు. పెద్దల అనుభవాలు, యువరక్తం ఆలోచనలతో 'మా' నడవాలనేదే తన ప్రయత్నమని చెప్పాడు. అందరి సహకారంతో విజయం సాధిస్తానని మంచు విష్ణు ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

కాగా మా ఎన్నికల్లో మంచు విష్ణుతో పాటు ప్రకాశ్‌ రాజ్‌, జీవిత, హేమ కూడా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రకాశ్‌ తన ప్యానెల్‌ను కూడా ప్రకటించారు. ఈ ఎన్నికలు సెప్టెంబర్‌లో జరగనున్నాయి.

చదవండి: MAA Elections 2021: ‘మా’ఎన్నికల్లో నరేశ్‌ కొత్త ప్రతిపాదన

మరిన్ని వార్తలు