MAA Elections 2021: విష్ణు ప్యానల్‌కే ఓటు వేయాలంటూ మోహన్‌ బాబు లేఖ

8 Oct, 2021 16:24 IST|Sakshi

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్ష పదవి పోటీ చేస్తున్న తన కుమారుడు, హీరో మంచు విష్ణు ప్యానల్‌కే ఓటు వేసి గెలిపించాలని నటుడు మోహన్‌ బాబు కోరారు. ఈ మేరకు ఆయన ఓ లేఖ విడుదల చేశారు. ‘మా’ అధ్యక్ష పదవి అంటే కీరిట కాదని, అదోక బాధ్యత అన్నారు. ‘నేను మీ అందరిలో ఒకడిని.  ఇండస్ట్రీలో కష్టం వచ్చిన ప్రతి సారి నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చిన దివంగత దర్శకుడు దాసరి నారాయణ గారి అడుగు జాడల్లో నడుస్తున్న ఆయన బిడ్డను. మీలో ఒకడిని. నిర్మాతలతో పాటు నిర్మాతని, నటులతో పాటు నటుడిని, దర్శక శాఖ పని చేసిన వాడిని.. చేసిన సాయం, ఇచ్చిన దానం ఎప్పటికీ చెప్పొద్దంటారు. కానీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.

చదవండి: MAA Elections 2021: ‘మా’ ఎన్నికలపై ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ సంస్థని స్థాపించిన రోజు నుంచి నేటి వరకు ఎన్నో చిత్రాలను నిర్మించి.. ఎందరో టెక్నిషియన్లను, కళాకారులను ఇండస్ట్రికీ పరిచయం చేశాను. 24 క్రాఫ్ట్స్‌లో ఉన్న ఎంతోమంది పిల్లలకి మరణించిన సినీ కళాకారుల పిల్లలకి మన విద్యాసంస్థల్లో ఉచితంగా విద్యా సౌకర్యాలు కల్పించి వాళ్లు గొప్ప స్థాయికి చేరేలా చేశాను. భవిష్యత్తులో కూడా దాన్ని కొనసాగిస్తాను కూడా. ఇక ‘మా’ అధ్యక్ష పదవిలో నేను ఉన్నప్పుడే వృద్ధాప్య పింఛన్లని ప్రవేశపెట్టాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి’ అంటూ మోహన్‌ బాబు తన లేఖలో రాసుకొచ్చారు. 

చదవండి: ప్రకాశ్‌రాజ్‌పై తీవ్ర విమర్శలు చేసిన కోట శ్రీనివాస రావు

‘‘మా’ అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదు, అదొక బాధ్యత. ఈసారి ఎన్నికల్లో నా కుమారుడు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడు. నా బిడ్డ నా క్రమశిక్షణకి, నా కమిట్‌మెంట్‌కి వారసుడు. తను ఇక్కడే ఉంటాడు. ఈ ఊళ్లోనే ఉంటాడు. ఏ సమస్య వచ్చినా మీ పక్కనే ఉంటాడని నేను మాటిస్తున్నా. మీరు మీ ఓటుని విష్ణుతో పాటు పూర్తి ప్యానల్‌కు వేసి సమర్థవంతమైన పాలనకి సహరించాలని మనవి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్టోబరు 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు, ప్రకాశ్‌రాజ్‌ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు