'మా' ఎన్నికలపై నటుడు మురళీ మోహన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

5 Jul, 2021 18:37 IST|Sakshi

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఎప్పుడు లేనంతగా ఈ సారి  అధ్యక్ష పదవీకి పోటీ పెరిగింది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమలతో పాటు సీవీఎల్‌ నరసింహారావు అధ్యక్ష రేసులో ఉన్నామని ప్రకటించారు. ఎలక్షన్‌ డేట్‌ రాకముందే పోటీ రసవత్తరంగా మారింది. దీంతో గతంలో కంటే ఈసారి 'మా' ఎన్నికలు రంజుగా సాగనున్నట్లు కనిపిస్తోంది. 

ఈ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్‌ మూడు వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగానే అభ్యర్థులు ప్రత్యర్థులపై ఆరోపణలు చేసుకోవడం, విమర్శనాస్త్రాలు సంధించుకోవడం మొదలెట్టేశారు. ఈ ఎన్నికలపై సోషల్‌ మీడియాలోనూ వాడీ-వేడి చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరణంలో సీనియ‌ర్ న‌టుడు, మా మాజీ అధ్య‌క్షుడు ముర‌ళీ మోహ‌న్ 'మా' ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి మా ఎన్నికలు ఉండవని.. ఏకగ్రీవమే జరుగుతుందని బాంబు పేల్చారు. గతంలో మా మెంబర్స్‌ తక్కువగా ఉండటంతో చాలా పద్దతిగా ఉండేదని, కానీ ఇప్పుడు అలా లేదంటూ ఆరోపణలు గుప్పించారు.

ఎవరికి పడితే వాళ్లకు మా సభ్యత్వం దొరుకుతుందని, దీంతో ఎవరు మా మెంబరో కాదో కూడా తెలియడం లేదని విమర్శించారు. గాడి తప్పిన 'మా' ను మళ్లీ పట్టాలెక్కించడానికి తనతో పాటు చిరంజీవి, మోహన్ బాబు, జయసుధ, కృష్ణంరాజు లాంటి సినీ పెద్దలు మాట్లాడుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అందరిని ఒకతాటి పైకి తెచ్చి ఏకగగ్రీవంగా మా ఎన్నికలు జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.  మురళీ మోహన్ కామెంట్స్‌తో మా అధ్యక్ష బరిలో ఉన్న వాళ్లకు ఊహించని షాక్‌ తగిలినట్లయ్యింది. 
 

మరిన్ని వార్తలు