రజనీకాంత్, అమితాబ్‌ బచ్చన్‌ లోకలా? : ఆర్జీవీ

26 Jun, 2021 10:32 IST|Sakshi

ప్రకాశ్‌రాజ్‌కు మద్ధతుగా నిలిచిన రామ్‌ గోపాల్‌ వర్మ

తెలుగు చిత్రపరిశ్రమలో ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (మా) ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఈసారి ఎన్నికలు రంజుగా సాగనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో జరగాల్సిన ఎన్నికలకు 3 నెలల ముందే వాతావరణం వేడెక్కింది. మా అధ్యక్షుడి స్థానం కోసం ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో  ఇప్పటికే టాలీవుడ్‌ మూడు వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకాశ్‌ రాజ్‌ మెగాస్టార్‌ చిరంజీవి మద్దతును సంపాదించగా, విష్ణు సూపర్‌స్టార్‌ కృష్ణ, రెబల్‌స్టార్‌ కృష్ణంరాజుల మద్దతును కూడగట్టారు.

ఇక ప్రకాశ్‌ రాజ్‌ ఇప్పటికే తన ప్యానల్‌ సభ్యులను ప్రకటించారు. ఈ క్రమంలో ‘కన్నడిగుడైన ప్రకాశ్‌రాజ్‌ ‘మా’ అధ్యక్షుడేమిటనే ‘లోకల్‌– నాన్‌ లోకల్‌’ చర్చ తెరపైకి వచ్చింది. కర్ణాటకలో పుట్టి పెరిగిన ప్రకాశ్‌ రాజ్‌ తెలుగు  నటుల సంఘానికి అధ్యక్షత వహించడం ఏంటనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ  ప్రకాశ్‌ రాజ్‌కు మద్ధతుగా నిలిచారు. అతని నటన చూసి నాలుగు సార్లు ఈ దేశం అతన్ని శాలువా కప్పి జాతీయ అవార్డుతో సత్కరిస్తే నాన్‌ లోకల్‌ అనడం ఏంటని ప్రశ్నించారు.

'ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉండి  తెలుగు నేర్చుకొని, చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ , తెలంగాణ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని , అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న ప్రకాశ్‌ రాజ్‌ నాన్‌ లోకలా' ? అని ప్రశ్నించారు.  కర్ణాటక నించి  ఏపీకి వచ్చిన ప్రకాశ్‌రాజ్‌ నాన్‌ లోకల్‌ అయితే,మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్ ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర కి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్  లోకలా అంటూ తనదైన స్టైల్‌లో పంచుల వర్షం కురిపించారు. ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్‌పై ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

చదవండి : ఆర్టిస్ట్‌లు లోకల్‌ కాదు.. యూనివర్సల్‌
MAA Elections 2021: ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ సభ్యులు వీరే

మరిన్ని వార్తలు