అయినా టాలీవుడ్ తీరు మారలేదు: మాధవి లత

2 Sep, 2020 19:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌లో డ్రగ్స్‌పై నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ తీసుకోవడం ప్రత్యక్షంగా చూశాని, బయటకు చెప్తే తన ప్రాణానికి ప్రమాదమని భయంతో ఎవరికీ చెప్పలేదని  అన్నారు. ఎక్సైజ్‌ విచారణ తర్వాత కూడా టాలీవుడ్‌ తీరు మారలేదని ఆమె విమర్శించారు. టాలీవుడ్‌లోనూ డ్రగ్స్‌పై అధికారులు దృష్టి పెట్టాలని మాధవీలత డిమాండ్‌ చేశారు. ఇటీవల జిన్నారంలో పట్టుబడ్డ వందల కోట్ల డ్రగ్స్‌కి టాలీవుడ్‌కి సంబంధం ఉంటుందని ఆమె  ఆరోపించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో డ్రగ్స్‌ విక్రయించేవారు ఎవరు? బాధితులు ఎవరు అనేది అధికారులు తేల్చాలని అన్నారు. సినీ నటులు అందం, ఫిట్‌నెస్‌ కోసం  మాదక ద్రవ్యాలను దిగుమతి చేసుకుంటారని అన్నారు. (చదవండి : 'డ్ర‌గ్స్ లేనిదే టాలీవుడ్‌లో పార్టీలు జ‌ర‌గ‌వు')

టాలీవుడ్‌పై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) దృష్టి పెట్టాలని మాధవి లత డిమాండ్‌ చేశారు. కాగా, బాలీవుడ్‌లో 99 శాతం మంది డ్రగ్స్‌ తీసుకుంటారని హీరోయిన్‌ కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను నటి మాధవీలత మొదటి నుంచి సమర్థిస్తున్నారు. బాలీవుడ్‌లోనే కాదు,టాలీవుడ్‌లో కూడా డ్రగ్స్‌ వాడుతున్నారని ఆమె ఆరోపించారు. టాలీవుడ్‌లో జరిగే పార్టీల్లో డ్ర‌గ్స్‌ వాడుతారని.. అది లేకుండా అసలు పార్టీలు జరగవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2007లో వచ్చిన అతిథి చిత్రంతో వెండితెరకు పరిచమైన మాధవిలత , నచ్చావులే సినిమాతో హీరోయిన్ గా మారింది. నానితో కలిసి స్నేహితుడు మూవీలో నటించింది. 

మరిన్ని వార్తలు