మరోసారి అరవింద్‌ స్వామితో జతకట్టిన నటి మధుబాల

13 Jul, 2021 18:15 IST|Sakshi

సినీ నటి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ  ఆధారంగా తలైవి మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. విజయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్ నటిస్తుండగా, ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్దమవుతుండగా తాజాగా దీని నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ వచ్చింది. ఇందులో ఎంజీఆర్‌ భార్య జానకీ రామచంద్రన్‌ పాత్రలో ప్రముఖ నటి మధుబాల నటిస్తున్నారు. ఇందులో ఆమె లుక్‌ను తాజాగా మేకర్స్‌ విడుదల చేశారు. ఎంజీఆర్‌(అరవింద్‌ స్వామి), మధుబాల సన్నివేశానికి సంబంధించిన వారిద్దరి ఫొటోను షేర్‌ చేశారు. 1992లో వచ్చిన మణిరత్నం మ్యుజికల్‌ హిట్‌ చిత్రం ‘రోజా’లో అరవింద్‌ స్వామి, మధుబాల జోడి హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక 28 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మరోసారి ‘తలైవి’ కోసం జతకట్టారు. 

ఈ సందర్భంగా మధుబాల మాట్లాడుతూ.. ‘తలైవి మూవీ షూటింగ్‌ చాలా బాగా వచ్చింది. ఈ మూవీ ఎప్పుడేప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంతో కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చింది. దీంతో మార్చిలో విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. అయితే థియేటర్లోకి ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. కానీ ‘తలైవి’ మాత్రం ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా మధుబాల రోజా మూవీ తర్వాత పలు సినిమాల్లో నటించి ఆ తర్వాత బ్రేక్‌ తీసుకున్నారు. 2017లో వచ్చిన కన్నడ చిత్రం ‘కాలేజీ కుమార్‌’తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ మూవీకి అంతగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు తాజాగా ఆమె మరోసారి తలైవి మూవీతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.  

A post shared by Thalaivi (@thalaivithefilm)

మరిన్ని వార్తలు