అక్కడ షూటింగ్‌ చేస్తే.. గరిష్టంగా రూ.2 కోట్లు రాయితీ!

5 Nov, 2022 17:35 IST|Sakshi

తమ రాష్ట్రంలో కనీసం యాభై శాతం షూటింగ్ (ఇండోర్/ఔట్ డోర్) జరుపుకునే చిత్రాలకు గరిష్టంగా కోటిన్నర నుంచి రెండు కోట్లు వరకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ ప్రకటించింది. అక్కడ ప్రభుత్వ లొకేషన్లకు చెల్లించే సొమ్ములో 75 శాతం సైతం వెనక్కి ఇచ్చేస్తామని మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ డిప్యూటీ డైరెక్టర్ ఉమాకాంత్ చౌదరి అన్నారు. తాజాగా ఆయన త సిబ్బందితో కలిసి హైదరాబాద్‌ విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్ లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ‘షూటింగ్ పర్మిషన్స్ జారీ చేయడం మొదలుకుని... నిర్ణీత వ్యవధిలో రాయితీ అందించడం వరకు ప్రతి ఒక్కటి పారదర్శకంగా ఉంటుందని, మధ్యప్రదేశ్ లో... దేశంలో మరెక్కడా లేని అద్భుత సందర్శనీయ ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేయడం... ఈ ప్రోత్సాహకాల ముఖ్య ఉద్దేశ్యమని’అన్నారు. ఇందుకోసం రూపొందించిన వెబ్ సైట్ ద్వారా అన్ని విషయాలు సమగ్రంగా తెలుసుకోవచ్చని ఉమాకాంత్ ప్రకటించారు. ఈ అవకాశం దక్షిణ భాషా చిత్రాలన్నింటికీ వర్తిస్తుందని వివరించారు. 

మధ్యప్రదేశ్ పర్యాటక సంస్థ కల్పిస్తున్న ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకుని, ‘తప్పించుకోలేరు’ చిత్రాన్ని తెరకెక్కించి... సౌత్ ఇండియాలోనే మొట్టమొదటిసారి నగదు ప్రోత్సాహకం అందుకున్న దర్శకనిర్మాత రుద్రాపట్ల వేణుగోపాల్ తన అనుభవాన్ని ఈ సందర్భంగా పంచుకున్నారు.  మధ్యప్రదేశ్ టూరిజం బోర్డ్ అందిస్తున్న ఈ అరుదైన అవకాశాన్ని వినియోగించుకోగోరువారు సహాయ సలహాల కొరకు తనను నేరుగా సంప్రదించవచ్చని, తన రెండో చిత్రం మధ్యప్రదేశ్ లోని పలు అద్భుత లోకేషన్స్ లో త్వరలోనే ప్రారంభం కానుందని వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో  నిర్మాతలు ఆచంట గోపీనాథ్, బెక్కెం వేణుగోపాల్, డి.ఎస్.రావు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, యువ దర్శకులు చందా గోవింద్ రెడ్డి, గౌతమ్ రాచిరాజు, రైటర్ రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు