Dhanush: కోట్లు విలువ చేసే లగ్జరీ కారు కొని.. పన్ను చెల్లించరా?

6 Aug, 2021 08:12 IST|Sakshi

చెన్నై: నటుడు ధనుష్‌కు మద్రాసు హైకోర్టు అక్షింతలు వేసింది. నటుడు ధనుష్‌ 2015లో రోల్స్‌రాయిస్‌ కారును విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. రాష్ట్ర రవాణశాఖ.. కారుకు ఎంట్రీ ట్యాక్స్‌ కట్టాల్సిందిగా ధనుష్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో ధనుష్‌ తన కారుకు ఎంట్రీ ట్యాక్స్‌ రద్దు చేయాల్సిందిగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. 
ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు 50 శాతం ఎంట్రీ ట్యాక్స్‌ చెల్లించేలా ఇంతకుముందు ఆదేశాలు జారీ చేసింది.

గురువారం మరోసారి ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ఎస్‌ ఎన్‌ సుబ్రమణియం ఉత్తర్వులో పిటిషన్‌దారుడు తను వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొన్నారని అయితే అందులో ఆయన పేరుకాని, వృత్తిగాని పొందుపరచకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా కోట్లు విలువ చేసే లగ్జరీ కారు కొని పన్ను మినహాయించాలని ఎలా అడుగుతున్నారంటూ కోర్టు మొట్టికాయలు వేసింది. 

మోటార్‌ సైకిల్‌పై పాల వ్యాపారం చేసుకునే వ్యక్తి కూడా పెట్రోల్‌కు జీఎస్టీ చెల్లిస్తున్నాడని అలాంటిది ధనుష్‌ ఎంట్రీ ట్యాక్స్‌ చెల్లించకపోవడంలో ఉద్దేశం ఏమిటని నిలదీసింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని, పన్ను చెల్లించాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ధనుష్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఇప్పటికే సగం పన్ను చెల్లించామని, మిగతా మొత్తాన్ని ఈనెల 9న చెల్లిస్తామని కోర్టుకు వివరణ ఇచ్చారు.


 

మరిన్ని వార్తలు