Kalyani Kurale Jadhav: రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి దుర్మరణం.. బైక్‌పై వెళ్తుండగా..

13 Nov, 2022 18:46 IST|Sakshi

సాక్షి, ముబై: కొల్హాపూర్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరాఠీ టెలివిజన్‌ నటి దుర్మరణం చెందారు. కళ్యాణి కురాలే జాదవ్‌ అనే 32 ఏళ్ల నటి శనివారం రాత్రి తన టూవీలర్‌పై ఇంటికి వెళ్లుండగా కాంక్రీట్‌ మిశ్చర్‌ ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. సాంగ్లీ-కొల్హాపూర్ హైవేపై హలోండి కూడలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కళ్యాణిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్‌ డ్రవర్‌ను అరెస్ట్‌ చేసి, అతనిపై కేసు మోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 

కాగా కళ్యాణి తుజ్హత్‌ జీవ్‌ రంగా, దఖంచ రాజా జ్యోతిబా వంటి మరాఠీ టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు సాధించారు. జాదవ్‌ కొల్హాపూర్‌ నగరంలోని రాజారంపురి ప్రాంతంలో నివాసముంటోంది. ఇటీవలే ఆమె హలోండిలో రెస్టారెంట్‌ ప్రారంభించారు. శనివారం రాత్రి రెస్టారెంట్‌ మూసివేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమె ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్‌ ఢీకొట్టినట్లు షిరోలి పోలీస్‌ అధికారి సాగర్‌ పాటిల్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు