Sakshi Excellence Award: వంశీకి జీవితాంతం రుణపడి ఉంటా: మహేశ్‌

25 Sep, 2021 10:17 IST|Sakshi

అన్నదాతలు, సేవాభిలాషులు, దేశాన్ని కాపాడే సైనికులు, సాహసమే శ్వాసగా తీసుకునే పరాక్రమవంతులు, ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న సినీ తారలు... మరెందరో స్ఫూర్తి ప్రదాతలకు సాక్షి మీడియా గ్రూప్‌ సలాం చేస్తోంది. వారి ప్రతిభకు గుర్తింపుగా ఈనెల 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో  ‘సాక్షి  ఎక్స్‌లెన్స్‌’ అవార్డులను అందజేసింది. అందులో భాగంగా 2019గాను మహేశ్‌బాబుకు మోస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

‘థ్యాంక్యూ భారతీగారు.. మీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ‘మహర్షి’ చిత్రం మా అందరికీ చాలా ప్రత్యేకం. థ్యాంక్యూ ‘సాక్షి’ టీవీ.. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజులైంది.. ఇలాంటి ఓ అవార్డు ఫంక్షన్‌ చూసి. మా నిర్మాతలు అశ్వనీదత్, పీవీపీ, ‘దిల్‌’ రాజుగార్లకు థ్యాంక్స్‌.. ‘మహర్షి’కి పనిచేయడం మరచిపోలేని జ్ఞాపకం. 2020 అనే ఏడాదిని మేమందరం మిస్‌ అయిపోయాం.. మీరు అవార్డు ఇచ్చి మళ్లీ ఫంక్షన్స్‌ చేసుకునేలా చేశారు.. మా డైరెక్టర్‌ వంశీకి థ్యాంక్స్‌. ‘మహర్షి’ లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అన్నారు. 


భారతీగారు మాకు చాలా నమ్మకం ఇచ్చారు
మహర్షి’ విడుదలై రెండున్నరేళ్లు అయింది.. ఈ అవార్డు మేం చేసిన పనికి గుర్తింపు మాత్రమే కాదు.. భారతీగారు మాకు చాలా నమ్మకం ఇచ్చారు.. మళ్లీ మంచి రోజులు వస్తాయని. ఇది నా ఒక్కడి అవార్డే కాదు.. మొత్తం మా టీమ్‌ది. నేను చేసిన ఐదు సినిమాల్లో నాలుగు సినిమాలు నిర్మించిన ‘దిల్‌’ రాజుగారు నా కుటుంబ సభ్యుల్లో ఒకరు. రాజు, శిరీష్, లక్ష్మణ్‌ గార్లకు కూడా థ్యాంక్స్‌. సినిమా అనేది కేవలం ఎంటర్‌టైన్‌మెంటే కాదు.. మన సంస్కృతి. మళ్లీ ప్రేక్షకులతో థియేటర్లు కళకళలాడే రోజుల కోసం వేచి చూస్తున్నా. ‘మహర్షి’ ప్రొఫెషనల్‌గా నాకు ఎంత ఇచ్చిందో తెలియదు కానీ వ్యక్తిగతంగా మహేశ్‌బాబుని ఇచ్చింది. నాకు జీవితాంతం రుణపడి ఉంటారని మహేశ్‌ అన్నారు.. ఆ మాట నాది. నేను ‘మహర్షి’ కథ చెప్పిన రోజు ఆయన చెప్పారు.. ‘ఈ సినిమాకి చాలా అవార్డులు అందుకుంటారని.. ఆ మాటలన్నీ నిజమయ్యాయి.. నన్ను నమ్మినందుకు థ్యాంక్యూ సార్‌’.  
వంశీ పైడిపల్లి, మోస్ట్‌ ఇన్‌స్పైరింగ్‌ మూవీ (మహర్షి)


మహేశ్‌ వెన్నెముకగా నిలిచారు 
ఈ అవార్డుకి మా ‘మహర్షి’ సినిమాని ఎంపిక చేసిన ‘సాక్షి’ యాజమాన్యానికి, భారతీగారికి థ్యాంక్స్‌. నాకెప్పుడూ ఓ ఎగై్జట్‌మెంట్‌ ఉంటుంది. మంచి సినిమా తీస్తే డబ్బులే కాదు.. గొప్ప గౌరవం తీసుకొస్తుందని నమ్ముతాను. ‘మహర్షి’ కథను వంశీ చెప్పినప్పుడు అదే నమ్మాను.. దానికి మహేశ్‌గారు వెన్నెముకగా నిలిచారు. ఈ సినిమా ప్రేక్షకులకే కాదు అవార్డ్స్, రివార్డ్స్‌ వరకూ వెళుతున్నందుకు థ్యాంక్స్‌. వంశీ పైడిపల్లి చెప్పినట్లు మాది పెద్ద ప్రయాణం. తన ఐదు సినిమాల్లో నాలుగు సక్సెస్‌ఫుల్‌గా చేశాం.. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది. మహేశ్‌గారితో కూడా మా బ్యానర్‌లో హ్యాట్రిక్‌ సాధించాం. 
– నిర్మాత ‘దిల్‌’ రాజు, మోస్ట్‌ పాపులర్‌ మూవీ (మహర్షి)

మరిన్ని వార్తలు