వీసీ సజ్జనార్‌ను అభినందించిన సూపర్‌ స్టార్‌

8 Aug, 2020 19:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రేపటితో 45వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఆదివారం(అగష్టు 9) ఆయన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులంతా ప్లాస్మా దానం చేయాలని కోరారు. అంతేగాక సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్లాస్మా దానంపై చేపడుతున్న అవగాహన కార్యక్రమంపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ప్లాస్మా దానంతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తూ పోలీస్ శాఖ సమర్థంగా పనిచేస్తోందన్నారు. కరోనా కాలంలో అనుక్షణం ప్రజల భద్రత చూసుకుంటూనే, మరోవైపు ప్లాస్మా దానం గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తున్న సీపీ సజ్జనార్‌ను కృషిని ఆయన కొనియాడారు. (చదవండి: బర్త్‌డే వేడుకలు: అభిమానులకు మహేష్‌ రిక్వెస్ట్‌)

ప్లాస్మా దానంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు సైబరాబాద్‌ ‍కమిషనర్‌ ప్రయత్నిస్తున్న తీరు అభినందనీయన్నారు. తన పుట్టినరోజున అభిమానులంతా కూడా ప్లాస్మా దానంపై అవగాహన కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే అవకాశం ఉన్నవాళ్లు ప్లాస్మా దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారి వంటి విపత్కర పరిస్థితుల్లో ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన అవసరం చాలా ఉందని మహేష్‌ బాబు పేర్కొన్నారు.  (చదవండి: ‘శభాష్‌ సైబరాబాద్‌ పోలీస్‌.. ఎస్‌సీఎస్‌సీ’)

మరిన్ని వార్తలు