మహేశ్ వీడియోతో టీఎస్ పోలీసుల వినూత్న ప్రచారం

24 Apr, 2021 17:14 IST|Sakshi

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజుకి లక్షల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్స్‌, ఆక్సిజన్‌ దొరకడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆందోళనకర పరిస్థితుల్లో సినీ సెలెబ్రిటీలు తమవంతు ప్రయత్నంగా ప్రజల్లో కరోనా జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ముందున్నారు.

గత కొద్ది కాలంగా సోషల్‌ మీడియా ఆయన కరోనా జాగ్రత్తలు చెబుతూనే ఉన్నారు. అలాగే కరోన కట్టడి కోసం కృషి చేస్తున్న పోలీసులు, వైద్యులకు కూడా తనకు తోచిన సహకారం అందిస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన ప్లాస్మా దానం చేయాలంటూ సైబరాబాద్‌ పోలీసులు చేసిన ట్వీట్‌పై స్పందించారు. ప్రతి ఒక్కరు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని తన అభిమానులకు మహేశ్‌ పిలుపునిచ్చారు.

‘కరోనాతో పోరాడుతున్న వారికోసం మనకు సాధ్యమైనంత చేయూతనిద్దాం. గతంలో కంటే ఇప్పుడు ప్లాస్మా దాతలు మరింత అవసరం. పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ గారు, సైబరాబాద్‌ పోలీసులు తీసుకున్న చొరవకు నా మద్దతు తెలియజేస్తున్నా’ అంటూ మహేశ్‌ ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ స్టేట్ పోలీస్ తమ అధికారిక ట్విటర్‌లో మహేశ్‌ బాబు వీడియోతో ప్రజల్లో కరోనా అవగాహన కల్పించేందుకు వినూత్న ప్రయత్నం చేసింది. 'జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు. బీ అలర్ట్. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్... మాస్కు తప్పనిసరిగా వాడండి' అంటూ మహేశ్‌ వాయిస్‌తో ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేశారు. దానికి 'మాస్క్ ఈజ్ మస్ట్' అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

చదవండి:
ఫన్‌ బకెట్‌ భార్గవ్‌ కేసు : అక్కాచెల్లెళ్ల వీడియో వైరల్‌ 
పీపీఈ కిట్‌ ధరించి.. కూరగాయలు కొనడానికి వచ్చిన నటి

మరిన్ని వార్తలు