SSMB 28: దుబాయ్‌లో మహేశ్‌ను కలిసిన త్రివిక్రమ్‌

28 Dec, 2021 07:57 IST|Sakshi

Mahesh Babu And Trivikram Srinivas Are Chilling At Dubai: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అన్నట్లు వర్క్‌ ఫ్రమ్‌ వెకేషన్‌ అంటున్నారు హీరో మహేశ్‌బాబు. ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్‌కు చిన్న బ్రేక్‌ ఇచ్చి కొన్ని రోజులుగా ఫ్యామిలీతో కలిసి మహేశ్‌బాబు దుబాయ్‌ వెకేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వెకేషన్‌లోనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తాను చేయనున్న సినిమాకి సంబంధించిన చర్చల్లో పాల్గొన్నారు మహేశ్‌. హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రం గురించిన చర్చల కోసం త్రివిక్రమ్‌ దుబాయ్‌ వెళ్లారు.

ఈ చర్చల్లో సంగీత దర్శకుడు తమన్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా పాల్గొన్నారు. ‘‘వర్క్‌ అండ్‌ చిల్‌. ఉపయోగకరమైన చర్చలతో సోమవారం మధ్యాహ్నం సాగింది’’ అంటూ ఓ ఫొటోను  సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు మహేశ్‌బాబు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ సిట్టింగ్స్‌లో భాగంగా మహేశ్, త్రివిక్రమ్, తమన్‌ దుబాయ్‌లో కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్‌ ఆరంభం కానుంది.  

మరిన్ని వార్తలు