కుమారుడి ఎంబీఏ ఫీజు కట్టలేకపోయా: మహేశ్

22 Jan, 2023 20:52 IST|Sakshi

బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత మహేష్ కొఠారే మరాఠీ, హిందీలో పలు చిత్రాలను తెరకెక్కించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన నటనా జీవితాన్ని ప్రారంభించిన ఆయన పలు సినిమాలు నిర్మించారు. కొఠారే రాజా ఔర్ రంక్, ఛోటా భాయ్, మేరే లాల్, ఘర్ ఘర్ కి కహానీ వంటి చిత్రాలలో నటించారు. ఆ తర్వాత ధూమ్ ధడకా (1985) సినిమాతో దర్శకత్వం ప్రారంభించారు. అయితే ఆయన తాజాగా తన జీవితంలోని అనుభవాలను వివరిస్తూ ఓ పుస్తకాన్ని రచించారు. గతవారమే ఆ పుస్తకాన్ని విడుదల చేశారు. తన జీవితంలో ఎదురైన అత్యంత క్లిష్ట పరిస్థితులను మహేశ్ కొఠారి వివరించారు. హిందీ, మరాఠీలో పలు హిట్ చిత్రాలు నిర్మించిన మహేశ్ 'యామ్ ఇట్ ఆనీ బరాచ్ కహి' పేరుతో గతవారం పుస్తకం విడుదల చేశారు. తన జీవితంలోని అత్యంత కష్టతరమైన దశ గురించి పుస్తకంలో వివరించారు. తన 60 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను ప్రస్తావించారు. 

మహేశ్ పుస్తకంలో వివరిస్తూ..' నేను 1962లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టా. బ్లాక్ అండ్ వైట్ సినిమా, కలర్ వన్, ఇప్పుడు డిజిటల్ సినిమాలు చేశా. నా జీవితంలో చాలా ఎత్తుపల్లాలు చూశా. నాకు చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో నేను చాలా అవమానానాలు ఎదుర్కొన్నా. నేను 1999లో లో మైన్ ఆగయా అనే హిందీ సినిమా తీశా. ఈ చిత్రంలో గోవింద మేనల్లుడు విజయ్ ఆనంద్ హీరో. అది నేను చేసిన పెద్ద తప్పు. ఆ సినిమా పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఆ ప్రభావం నాపై దాదాపు 15 ఏళ్లు కొనసాగింది. ఆ కష్టకాలాన్ని అధిగమించేందుకు ఎన్ని ఇబ్బందులు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. ఆ దెబ్బకు మా ఇంటిని కూడా అమ్మేశాం. నా కొడుకు ఎంబీఏ అడ్మిషన్ కోసం ఫీజు చెల్లించలేని పరిస్థితి. కానీ నా పరిస్థితిని కొడుకు అర్థం చేసుకుని డబ్బులు అడగలేదు. కానీ ఈ ప్రభావం నా కుటుంబంపై పడకుండా ఉండేందుకు నేను నా వంతు ప్రయత్నం చేశా.' అని వివరించారు. 

మరిన్ని వార్తలు