మేజర్‌ టీజర్‌ వచ్చేసింది.. మాటల్లేవ్‌ అంటున్న నెటిజన్లు

12 Apr, 2021 16:39 IST|Sakshi

గూఢచారి తర్వాత హీరో అడివి శేష్‌, దర్శకుడు శశికిరణ్‌ తిక్క కాంబినేషన్‌లో వస్తున్న సినిమా మేజర్‌. శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముంబై 26/11 ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సోమవారం మేజర్‌ టీజర్‌ రిలీజైంది. తెలుగులో మహేశ్‌బాబు, హిందీలో సల్మాన్‌ఖాన్‌, మలయాళం వర్షన్‌ను పృథ్వీరాజ్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో అగ్నికీలల్లో కాలిపోతున్న హోటల్‌లో అమాయకులను కాపాడేందుకొచ్చిన వీరుడిలా అడివి శేష్‌ కనిపిస్తున్న సీన్‌తో టీజర్‌ మొదలవుతుంది.

'బార్డర్‌లో ఆర్మీలా ఫైట్‌ చేయాలి, ఇండియా క్రికెట్‌ మ్యాచ్‌ అయినా గెలవాలి.. అందరూ ఇదే ఆలోచిస్తారు. అదీ దేశభక్తే. దేశాన్ని ప్రేమించడం అందరి పని, వాళ్లను కాపాడటం సోల్జర్‌ పని', 'డోంట్‌ కమ్‌ అప్‌.. ఐ విల్‌ హ్యాండిల్‌ దెమ్‌(ఎవరూ రాకండి. వాళ్ల సంగతి నేను చూసుకుంటాను)' అని హీరో చెప్పిన డైలాగులు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. బీజీఎమ్‌ మాత్రం అదరగొడుతోంది. ఈ టీజర్‌ చూసిన నెటిజన్లు గూస్‌బంప్స్‌ వస్తున్నాయ్‌.. దీని గురించి చెప్పడానికి మాటల్లేవ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. హీరో నాని సైతం ఈ మధ్యకాలంలో ఇంత మంచి టీజర్‌ను చూడలేదని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేయడం విశేషం. 

‘మేజర్‌’ను ఈ జూలై 2న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు హీరో మహేశ్‌బాబు నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నాడు.

చదవండి: మేజర్‌: ఉగ్రవాదులతో పోరాడిన ధీర వనిత..

అమెరికన్లు ఈ హీరోను అధ్యక్షుడిగా కావాలనుకుంటున్నారంట

మరిన్ని వార్తలు