ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం: ఆదిపురుష్‌ టీం

8 Sep, 2020 15:50 IST|Sakshi

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తన్హాజీ దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించనున్న భారీ బడ్జెట్‌ సినిమా ‘ఆదిపురుష్‌’. రామాయణం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో డార్లింగ్‌ ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నారు. ప్రతినాయకుడి రావణ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ నటించబోతున్నారు. అయితే ఈ సినిమాలో మరో ముఖ్య  పాత్ర సీత. ఈ క్యారెక్టర్‌లో ఏవరూ నటిస్తున్నారనేది ఆది నుంచి ఆసక్తికరంగా మారింది. మొదట్లో సీత పాత్రలో కీర్తి సురేష్‌, కియారా అద్వాణీ పేర్లు వినిపించగా, ఇటీవల మరో నటి ఊర్వశి రౌతేలాను సంప్రదించిన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ వదంతులపై చిత్ర బృందం స్పందించింది. (అటవీ భూమిని దత్తత తీసుకున్న ప్రభాస్‌)

ఆదిపురుష్‌ సినిమా కోసం ఊర్వశిని సంప్రదించినట్లు వచ్చిన వార్తలను చిత్ర యూనిట్‌ ఖండించారు. ‘ఆదిపురుష్‌లో ప్రధాన పాత్ర పోషించడానికి ఊర్వశి రౌతేలాను సంప్రదించినట్లు వస్తున్న కథనాలు, నివేదికలు పూర్తిగా నిరాధారమైనవి. అవాస్తవాలు.’ అని స్పష్టంచేశారు. అయితే ఈ సినిమాలో ఇప్పటివరకు కేవలం ప్రభాస్‌, సైఫ్‌ పాత్రలను మాత్రమే అధికారికంగా ఖరారు చేశారు. కాగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతున్న ఈ మూవీని టీ సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్ నిర్మిస్తుండగా హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేసి విడుదల చేయనున్నారు. 3డీలో తెరకెక్కనున్న ఈ మూవీపై ప్రభాస్‌ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. (ఆదిపురుష్‌లో ఆయ‌నే రావ‌ణుడు)

>
మరిన్ని వార్తలు