Anna Reshma Rajan: నటికి చేదు అనుభవం, షోరూమ్‌లో లాక్‌ చేసిన సిబ్బంది!

8 Oct, 2022 16:58 IST|Sakshi

మలయాళ నటి అన్నా రేష్మ రాజన్‌కు చేదు అనుభవం ఎదురైంది. కొత్త సిమ్‌ తీసుకునేందుకు దగ్గర్లోని షోరూమ్‌కు వెళ్లగా అక్కడి సిబ్బంది ఆమెను లోపలే ఉంచి తాళం వేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. 'అంగమలి డైరీస్‌' ఫేమ్‌ నటి అన్నా రాజన్‌ గురువారం నాడు అలువ మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోని ఓ టెలికాం కంపెనీ ఆఫీస్‌కు సిమ్‌ కార్డు కోసం వెళ్లింది. అయితే సిమ్‌ తీసుకునే విషయంలో అన్నాకు, అక్కడి సిబ్బందికి మధ్య వాగ్వాదం జరగ్గా ఆమెను లోపలే ఉంచి తాళంవేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అన్నా రాజన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు ఇరువురి మధ్య గొడవను పరిష్కరించినట్లు సమాచారం.

ఈ విషయంపై అన్నా రాజన్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'ఓ సిమ్‌ కార్డు కోసం నేను టెలికాం కంపెనీకి వెళ్లాను. నేను నటిగా కాకుండా సాధారణ మహిళగా ముఖానికి మాస్కు పెట్టుకుని వెళ్లాను. సిమ్‌ కార్డు తీసుకునే క్రమంలో వారికి, నాకు మధ్య గొడవ జరిగింది. కోపంతో వాళ్లు నన్ను లోపలే ఉంచి తాళం వేశారు. తర్వాత ఇలా చేసినందుకు క్షమాపణలు చెప్పారు. కాబట్టి నేను కేసు వెనక్కు తీసుకున్నాను' అని చెప్పుకొచ్చింది. కాగా అన్నా రాజన్‌ 2017లో 'అంగమలి డైరీస్‌' చిత్రంతో మాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత 'వేలిపడింతె పుస్తకం' సినిమాలో నటించింది. సూపర్‌ హిట్‌ మూవీ 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' మూవీలో పృథ్వీరాజ్‌ భార్యగా అలరించింది.

A post shared by anna rajan (@annaspeeks)

చదవండి: బిగ్‌బాస్‌ షోలో ఈవారం ఎలిమినేట్‌ అయ్యేది అతడే!
అప్పటి చైల్డ్‌ ఆర్టిస్టులు.. ఇప్పటి సెలబ్రిటీలు

మరిన్ని వార్తలు