తిరువనంతపురం: మలయాళ ప్రముఖ దర్శకుడు, స్ర్కీన్ ప్లే రచయిత సాజీ పాండవత్(63) కన్నుమూశారు. ఆయన ఆదివారం గుండె సంబంధిత వ్యాధి కారణంగా ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందినట్లు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఫెఫ్కా) డైరెక్టర్స్ యూనియన్ తన ఫేస్బుక్లో వెల్లడించింది. గుండె శస్త్ర చికిత్స అనంతరం ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో కుప్పకూలి పడిపోవడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు.
ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ప్రయక్కర పప్పన్, గంగోత్రి, కవచం సహా పలు సినిమాలకు ఆయన స్క్రీన్ ప్లే రాశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘కక్కతురుతు’ విడుదలకు సిద్ధంగా ఉంది. సాజీ పాండవత్ మృతికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు.