ప్రముఖ రచయిత ఖాదర్ ఇకలేరు.. సీఎం పినరయి సంతాపం

22 Jun, 2021 15:02 IST|Sakshi

తిరువనంతపురం : ప్రముఖ మలయాళ గేయ రచయిత పూవచల్ ఖాదర్ (72) కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డ ఆయన చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పూవచల్‌లోని జూమా మసీదులో ఖాదర్‌ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. 1973లో విజయనిర్మల దర్శకత్వం వహించిన కవిత అనే చిత్రంతో రచయితగా ప్రస్థానం మొదలుపెట్టిన ఖాదర్‌.. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో 350కి పైగా సినిమాలకు పాటలు రాశారు. నాధ నీ వరుమ్ కలోచ (చమరం), పండోరు కట్టిలోరన్ సింహామ్ (సందర్భం), పొన్వీన్ (తలవట్టం) మరియు ఎంటె జన్మమ్ నీయేదుత్తు (అత్తక్కలసం) వంటి పాటలు ఆయన కలంలో వచ్చినవే.

మలయాళ పరిశ్రమలో ఇప్పటివరకు ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు ఆయన పాటలు రాశారు. ముఖ్యంగా 70-80వ దశకంలో ఖాదర్‌ రాసిన దాదాపు అన్ని పాటలు సూపర్‌ డూపర్‌ హిట్లుగా నిలిచాయి. కెవి మహాదేవన్, ఇలయరాజా, శంకర్ గణేష్ వంటి ఎందరో ప్రముఖుల వద్ద పనిచేసిన ఖాదర్‌ ఎన్నో సినిమాలకు పాటలు రాశారు. ఖాదర్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. మలయాళంలో అత్యధిక సినిమా పాటలు రాసి రికార్డు నెలకొల్పిన ఖాదర్‌ మృతి సినీ రంగానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు.

చదవండి : MAA Elections: ప్రకాశ్‌రాజ్‌ వర్సెస్‌ మంచు విష్ణు!
అభిమానికి బెల్లంకొండ ఫ్యామిలీ సర్‌ప్రైజ్‌

మరిన్ని వార్తలు