నువ్వు నిజమైన జాతిరత్నానివి సామి!

31 Mar, 2021 15:56 IST|Sakshi

నెట్టింల్లో వైరలవుతోన్నసీన్‌

కామెంట్స్‌తో చంపేస్తోన్న నెటిజనులు

టీవీ సీరియల్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క పాయింట్ తీసుకుని ఏళ్లకేళ్లు సాగదీస్తూనే ఉంటారు. అందుకే వీటిని జీడిపాకం.. బబుల్‌గమ్‌తో పోలుస్తుంటారు. ఎవరెన్ని కామెంట్స్‌ చేసినా సీరియల్స్‌కు ఉండే క్రేజ్‌ను మాత్రం ఒప్పుకుని తీరాల్సిందే. ఇక తాజాగా సీరియల్స్‌లో కూడా సినిమాటిక్‌ సీన్‌లు బాగా పెరుగుతున్నాయి. రొమాన్స్‌, ఫైట్‌ సీన్లతో పాటు.. మరి కొన్ని అడ్వెంచరస్‌ సీన్‌లను కూడా రూపొందిస్తున్నారు దర్శకులు. ఇక ఈ మధ్య కాలంలో వచ్చే సీరియల్స్‌లో సినిమా దర్శకులు కూడా ఊహించలేని  సీన్లు బాగా పెరిగిపోయాయి. 

ఇక మానవాతీత శక్తులకు సంబంధించిన సీరియల్స్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. వీటిలో లాజిక్‌ని వెతికితే మన చిప్పు దొబ్బుతుంది. ఇప్పుడు ఈ సీరియల్స్‌ పురాణం ఎందుకంటున్నారా.. తాజాగా ఓ సీరియల్‌కు సంబంధించిన సీన్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ సన్నివేశం చూసి నెటిజన్లు చేసే కామెంట్స్‌ వింటే సదరు సీరియల్‌ దర్శకుడు నిజంగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. అంతగా ఏం చేసాడబ్బా అనుకుంటున్నారా.. తన సీరియల్‌లో ప్రియుడు, ప్రియురాలి కోసం ఏకంగా చందమాను తుంచి ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చే సన్నివేశాన్ని రూపొందించాడు సదరు దర్శకుడు. ఈ సీన్ చూసిన తర్వాత నెటిజన్లు చేసే కామెంట్స్‌ చూస్తే పొట్ట చెక్కలవ్వడం ఖాయం. 

ఇంతకు ఈ అపురూప దృశ్యం ఏ సీరియల్‌లో వచ్చింది అంటే.. ‘యే జాదు హై జిన్ కా’. స్టార్ ప్లస్‌లో ప్రసారమైన ఫాంటసీ డ్రామా సీజన్ 2లోని సీన్ ఇది. అక్టోబరు 2019-నవంబరు 2020 మధ్య ప్రసారమైంది. తెలుగులో కూడా ఈ సీరియల్ వస్తుంది. జిన్ మాయాజాలం పేరుతో మాటీవీలో ఈ సీరియల్ వస్తుంది. ఇలాంటి జాతిరత్నం లాంటి సీన్ ఉన్న సీరియల్ కోసం హాట్‌స్టార్‌‌ను సబ్‌స్క్రైబ్ చేసుకుని మరీ చూస్తున్నారు నెటిజన్లు.

ఇక సీరియల్‌లో భాగంగా తనను పెళ్లి చేసుకోవాలంటే చందమాను తుంచి తీసుకురావాలని లవర్‌కి కండిషన్‌ పెడుతుంది ప్రియురాలు. దాంతో వెంటనే తన కారు వేసుకుని గాల్లోకి వెళ్లిపోయి.. చంద్రుడి పైకి మన మ్యాజిక్ స్టిక్ విసురుతాడు హీరో. ఆ దెబ్బకు చంద్రుడు ముక్కలైపోతాడు. కొన్ని ముక్కలు భూమ్మీదకి వచ్చి పడతాయి.

ఇక ఈ సీన్‌ చూసిన జనాలు పిచ్చెక్కిపోతున్నారు. ‘‘మీ క్రియేటివిటీ తగలడా.. అసలు ఎలా వస్తాయ్‌ రా నాయనా మీకు ఇలాంటి లాజిక్‌లేని ఆలోచనలు’’.. ‘‘చంద్రుడిపైకి వెళ్లేందుకు ‘నాసా’ అనవసరంగా ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది.. ఇక మీదట మన హీరోని గారిని పంపిస్తే సరి’’.. ‘‘విఠలాచార్య చచ్చి బతికిపోయారు కానీ ఇప్పుడు కానీ ఉండుంటే ఈ సీన్ చూసి పోయేవారు కదరా’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. పోతార్రోయ్‌ సర్వనాశనమైపోతారు‌ అంటూ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు.

చదవండి: 
కార్తీక దీపం కోసం ‘ఐపీఎల్ టైమింగ్ మార్చండి'
ఇట్లు.. ప్రేమతో మీ 'కార్తీకదీపం' దీప

మరిన్ని వార్తలు