Bharathiraja: తనయుడి డైరెక్షన్‌లో నటించనున్న ప్రముఖ దర్శకుడు

25 May, 2023 09:22 IST|Sakshi

సీనియర్‌ దర్శకుడు భారతీరాజా ఏడు పదులు దాటిన వయసులోనూ నటుడిగా బిజీబిజీగా ఉన్నారు. మరో పక్క మళ్లీ దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈయన ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనికి మార్గళి తింగళ్‌ అనే టైటిల్‌ నిర్ణయించారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడు భారతీరాజా వారసుడు మనోజ్‌ భారతీరాజా దర్శకుడిగా పరిచయం అవుతుండడం విశేషం.

ఈయన 1999లో తండ్రి భారతీరాజా దర్శకత్వం వహించిన తాజ్‌మహల్‌ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత సముద్రం, వరుషమెల్లామ్‌ వసంతం, అల్లిఅర్జున్‌ చిత్రాల్లో నటించారు. ఇటీవల శింబు హీరోగా నటించిన హిట్‌ చిత్రం మానాడులోనూ కీలక పాత్ర పోషించారు. అప్పుడు భారతీరాజా కొడుకును డైరెక్ట్‌ చేశారు. ఇప్పుడు మనోజ్‌ తండ్రిని దర్శకత్వం వహిస్తున్నారన్న మాట.

ఈయన మెగాఫోన్‌ పట్టిన చిత్రాన్ని దర్శకుడు సుశీంద్రన్‌ తన వెన్నిలా ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో దర్శకుడు భారతీరాజా ప్రధాన పాత్రను పోషిస్తుండగా ఇతర పాత్రల్లో నూతన నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందని దర్శకుడు తెలిపారు. మార్గళి తింగళ్‌ చిత్ర షూటింగ్‌ను బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.

చదవండి: ఉదయ్‌ కిరణ్‌ డెత్‌ మిస్టరీ.. అంత అమాయకంగా నటిస్తున్నారేంటి: తేజ

మరిన్ని వార్తలు