కంగనా వివాదస్పద వ్యాఖ్యలకు ప్రముఖ నటుడి మద్దతు..

14 Nov, 2021 18:13 IST|Sakshi

ప్రముఖ మరాఠీ నటుడు విక్రమ్ గోఖలే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చారు. ఆదివారం మహారాష్ట్రలోని పూణెలో జరిగిన ఓ కార్యక్రమంలో గోఖలే మాట్లాడుతూ కంగనా చెప‍్పింది నిజమేనని అన్నారు. '1947లో భారతదేశానికి వచ్చింది భిక్ష. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాకే నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది.'  అని కంగనా అన్నారు. 
చదవండి: Kangana Ranaut: నాటి స్వాతంత్య్రం భిక్ష

"కంగనా రనౌత్ వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను. మనకు స్వాతంత్ర్యం ఇచ్చారు. కానీ స్వాతంత్ర్య సమరయోధులను ఉరితీసినప్పుడు (బ్రిటీష్ పాలనలో) చాలా మంది మూగ ప్రేక్షకులుగా మాత్రమే ఉన్నారు. ఈ మూగ ప్రేక్షకులలో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వారు పోరాడుతున్న స్వాతంత్ర్య సమరయోధులను రక్షించలేదు. " అని గోఖలే అన‍్నారు. మరాఠీ థియేటర్, బాలీవుడ్, టెలివిజన్‌లో చేసిన పాత్రలతో గోఖలే గుర్తింపు పొందారు. 

బీజేపీతో సహా ప్రతి రాజకీయ పార్టీ వివాదాల నుంచి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందని గోఖలే అభిప్రాయపడ్డారు. త్రిపురలో జరిగిన మత హింస, అమరావతి, మహారాష్ట్రలోని ఇతర నగరాల్లో రాళ్ల దాడి ఘటనలు చోటుచేసుకున్నాయని, వాటిపై నటుడి అభిప్రాయాన్ని అడగ్గా.. 'మతపరమైన అల్లర్లు ఓటు బ్యాంకు రాజకీయాల ఫలితమే. ప్రతి రాజకీయ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు ఆడుతుంది' అని గోఖలే పేర్కొన్నారు.
చదవండి: నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. పద్మశ్రీ తిరిగి ఇ‍చ్చేస్తా: కంగనా

మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులపై గోఖలే మాట్లాడుతూ, దేశాభివృద్ధి కోసం మాజీ మిత్రపక్షాలైన శివసేన, బీజేపీ మళ్లీ కలిసి రావాలని అన్నారు. 'బీజేపీ, శివసేన మళ్లీ కలిసి రావాలి. సీఎం పదవిని సమానంగా పంచుకునే షరతుపై రెండు పార్టీల మధ్య పొత్తు సాధ్యమేనా అని నేను (ప్రతిపక్ష నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి) దేవేంద్ర ఫడ్నవీస్‌ను ప్రశ్నించాను. రెండు పార్టీలు ప్రయత్నించాలి. ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు.. రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేయకూడదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు వారిని శిక్షించగలరు" అని విక్రమ్‌ గోఖలే తెలిపారు. 

మరిన్ని వార్తలు