Pakka Commercial: ఇంకా బెటర్‌ కంటెంట్‌తో మీ ముందుకు వస్తా : మారుతి

3 Jul, 2022 14:15 IST|Sakshi

‘పక్కా కమర్షియల్‌’ చిత్రం మేము అనుకున్నట్లే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా దూసుకెళ్తోంది. నా సినిమాకు వచ్చే అడియన్స్‌ ఏం ఆశిస్తారో అవన్ని ఇందులో ఉన్నాయి. ఇలాంటి ఆన్ సీజన్ టైమ్ లో కూడా ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తున్నారు. వారందరికి నా ధన్యవాదాలు’అన్నారు ప్రముఖ దర్శకుడు మారుతి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్‌’.  గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రాన్ని  అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ పతకాలపై  బ‌న్నీ వాస్ నిరి​ంచారు. జులై 1న ఈ చిత్రం విడుదలై పాజిటివ్‌ టాక్‌ని సంపాదించుకుంది.

(చదవండి: అలాంటివారిని దూరం పెడతాను: రాశీ ఖన్నా)

ఈ నేపథ్యంలో తాజాగా చిత్రయూనిట్‌  పాత్రికేయుల సమక్షంలో సక్సెస్‌ సంబరాలను జరుపుకుంది. అనంతరం మారుతి మాట్లాడుతూ.. ‘మా సినిమాకు అన్ని చోట్ల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడం హ్యాపీగా ఉంది. కలెక్షన్స్‌ రోజు రోజుకి పెరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత గోపీచంద్‌ని స్టైలీష్‌గా చూపించారని, రాశీఖన్నా ట్రాక్‌ బాగుందని చెబుతున్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మళ్లీ ఇంకా బెటర్‌ కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను’ అని అన్నారు. 

చిత్ర నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఆడియన్స్ మంచి మాస్ ఎంటర్ టైనర్ సినిమా ఇస్తే బాగుంటుందని ఈ సినిమా తీశాం. మేము అనుకున్నట్లే అది ఈ రోజు అందరికీ రీచ్ అయ్యింది. తొలి రోజే  రూ.6 కోట్లు కలెక్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే మా సినిమా  క్లియర్ కమర్సియల్ హిట్ కింద పరిగణించవచ్చు. ఇప్పటి వరకు వచ్చిన గోపీచంద్ సినిమాలలో ద  బెస్ట్ ఓపెనింగ్ అనుకుంటున్నాను. మారుతి సినిమా అంటే ఎంటర్ టైన్మెంట్ కు మార్క్. ఇందులోని సన్నివేశాలు చూసి ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో పనిచేసిన గోపి చంద్, రాశి ఖన్నా  లకు మరియు మిగిలిన నటీ నటులందరికీ ధన్యవాదాలు ’అన్నారు.

ఇలాంటి మంచి సినిమాలో నాకు క్యారెక్టర్‌ ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపాడు నటుడు సప్తగిరి. ‘ఎంటర్ టైన్మెంట్ కోరుకునే వారికీఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ప్రస్తుతం  మేము టికెట్స్ రేట్ తగ్గించాం. ఇప్పట్లో ఈ సినిమా ఓటిటి లో రాదు. కాబట్టి అందరూ వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను ’అన్నారు సహ నిర్మాత ఎస్‌కేఎన్‌.  ఈ చిత్రంలో రావు రమేశ్‌, సత్యరాజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. 

మరిన్ని వార్తలు