నాగార్జున ఫ్యాన్స్‌ను ఏప్రిల్‌ ఫూల్‌ చేసిన 'వైల్డ్‌ డాగ్‌' యూనిట్‌‌‌

1 Apr, 2021 19:23 IST|Sakshi

అక్కినేని నాగార్జున పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న చిత్రం "వైల్డ్‌ డాగ్‌". వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ సినిమాలో దర్శకుడు సహా అందరూ కొత్తవాళ్లే. దీంతో ఈ సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లేందుకు నాగ్‌ బాగా కష్టపడుతున్నాడు. మిగతా సినిమాల కంటే భిన్నంగా ప్రమోట్‌ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కూడా ప్రమోషన్లు బాగానే చేస్తోంది. అందులో భాగంగా సినిమా లీక్‌ అయిందంటూ ప్రచారం మొదలుపెట్టింది. ఎవరో తమ యూట్యూబ్‌ ఛానల్‌ను హ్యాక్‌ చేసి, వైల్డ్‌ డాగ్‌ ఫుల్‌ మూవీని అప్‌లోడ్‌ చేశారని ట్వీట్‌ చేసింది.

ఇంకేముందీ.. రిలీజవకముందే సినిమా ఎలా అప్‌లోడ్‌ చేస్తారు? అని తల గోక్కుంటూనే అక్కడి యూట్యూబ్‌ లింకును క్లిక్‌ చేస్తున్నారు జనాలు. తీరా లింక్‌ ఓపెన్‌ అవగానే అలీ రెజా, సయామీ ఖేర్‌ ప్రత్యక్షమై "పైరసీ ఆపండి. వైల్డ్‌డాగ్‌ థియేటర్‌లోనే చూడండి" అని సెలవిచ్చారు. అలా నాగార్జున ఫ్యాన్స్‌ను ఏప్రిల్‌ ఫూల్‌ చేశారు. దీంతో దిమ్మతిరిగిన నెటిజన్లు 'ఇది కనీవినీ ఎరగని ఏప్రిల్‌ ఫూల్‌', 'దగా మోసం, అరాచకం..' అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం 'అబ్బో ఇంటర్వెల్‌లో సీన్‌ ఉంటుంది మాస్టారూ.. మాటల్లేవ్‌ చెప్పడానికి..', 'సెకండాఫ్‌లో, క్లైమాక్స్‌లో సన్నివేశాలు అదుర్స్‌ అంతే..' అంటూ ఫన్నీగా కౌంటర్లు వేస్తున్నారు. కాగా ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్‌ 2న) రిలీజ్‌ అవుతోంది.

చదవండి: నా సగం కల పూర్తయింది.. ఇంకో సగం మిగిలి ఉంది

నాగ్‌ సార్‌ బిర్యాని తెస్తే.. ఓ పట్టుపట్టా: హీరోయిన్‌

మరిన్ని వార్తలు