Chiranjeevi: ఎలాంటి బాధ లేదు.. ఎందుకంటే ఆయన చెప్పిందే మేము చేశాం: చిరంజీవి

1 Oct, 2022 16:33 IST|Sakshi

మొదటిసారి తండ్రి, తనయుల కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఆచార్య. తాజాగా ఆ మూవీ ఫెయిల్యూర్‌పై మెగాస్టార్ స్పందించారు. ఆయన నటించిన తాజా చిత్రం గాడ్‌ ఫాదర్‌ ప్రమోషన్లలో భాగంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. భారీ అంచనాలతో రిలీజైన ఆచార్య బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. 

ఆచార్యపై చిరంజీవి మాట్లాడుతూ 'సినిమా ఫలితం మన చేతుల్లో ఎప్పుడు ఉండదు. మన పనిలో మనం బెస్ట్‌ ఇస్తామంతే. ఆచార్య పరాజయం నన్ను బాధ పెట్టలేదు. ఎందుకంటే దర్శకుడు చెప్పిందే మేం చేశాం. ఈ చిత్రంలో చిన్న విచారం ఏంటంటే.. చరణ్‌ నేను కలిసి మొదటిసారి నటించాం. అది హిట్‌ కాలేదు. ఒకవేళ భవిష్యత్తులో మేము మళ్లీ కలిసి పనిచేయాలనుకుంటే అంతటి హైప్‌ ఉండకపోవచ్చు. అంతకు మించి ఎలాంటి బాధ లేదు' అని అన్నారు. 

చిరంజీవి, రామ్‌చరణ్‌​ నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఏప్రిల్‌29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను తెచ్చుకుంది. ప్రస్తుతం మెగాస్టార్ నటించిన 'గాడ్‌ ఫాదర్‌' రిలీజ్‌కు సిద్ధమైంది. దసరాకు థియేటర్లలో సందడి చేయనుంది. 

మరిన్ని వార్తలు