రాజుగారి ద్వారానే ఎన్నో విషయాలు నేర్చుకున్నా: చిరు

22 May, 2021 09:23 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

టాలీవుడ్‌ పీఆర్వో బీఏ రాజు మృతి పట్ల ప్రముఖుల సంతాపం వెల్లువెత్తుతోంది. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో అందరివాడిగా పేరున్న ఆయన.. ఇక లేరనే విషయాన్ని చాలామంది నమ్మలేకపోతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, బీఏ రాజులోని ప్రత్యేకతను గుర్తు చేసుకుంటూ నివాళి అర్పించాడు. 

మద్రాస్‌లో ఉన్నప్పుడు ఇండస్ట్రీ విషయాలెన్నో బీఏ రాజు తనతో పంచుకునేవారని, షూటింగ్‌ స్పాట్‌కి వచ్చి సరదాగా ముచ్చటించేవారని చిరు గుర్తుచేసుకున్నారు. అంతేకాదు ఇండస్ట్రీకి సంబంధించి కొత్త విషయాలెన్నో రాజుగారి ద్వారానే తెలుసుకున్నానని చెప్పారు. సినిమాలకు సంబంధించి కలెక్షన్ల దగ్గరి నుంచి ఎన్ని సెంటర్లు ఆడిందనే విషయాల దాకా ప్రతీ చిన్న కూడా అలవోకగా చెప్పే రాజుగారు..  సినీ ఇండస్ట్రీకి ఒక ఎన్‌సైక్లోపీడియా లాంటి వారని పొగడ్తలు గుప్పించాడు చిరంజీవి. బీఏ రాజు ఆత్మకు శాంతి కలగాలని కొరుకుంటూ, ఆయన కుటుంబానికి ట్విట్టర్‌ ద్వారా సానుభూతి తెలియజేశాడు. 

ఆత్మీయుడ్ని కోల్పోయా: సమంత
బీఏరాజు మృతి పట్ల నటి సమంత అక్కినేని భావోద్వేగానికి లోనైంది. తన మొదటి సినిమా నుంచి ఆయన తన వెంటే ఉన్నారని, సినిమా హిట్‌ అయినా ఫ్లాప్‌ అయినా తనతో ఆత్మీయంగా మాట్లాడేవారని గుర్తు చేసుకుంది. తన సినీ జీవితానికి బీఏ రాజు ఒక ఆశాకిరణంగా ఉన్నారని  #RipBaRajuGaru హ్యాష్‌ట్యాగ్‌తో సమంత ట్వీట్‌ చేసింది.

మరోవైపు హీరో ప్రభాస్‌ తన ఫేస్‌బుక్‌లో నివాళి అర్పించాడు. రాజుగారితో తాను పనిచేశానని, ఆయన తన ఇంటి మనిషి అని ప్రభాస్‌ ఎమోషనల్‌ అయ్యాడు. పదిహేను వందలకుపైగా సినిమాలకు పనిచేసిన బీఏరాజు మృతి దిగ్భ్రాంతి కలిగించిందని దర్శకుడు రాజమౌళి ట్వీట్‌ చేశాడు. మరోవైపు మ్యూజిక్‌ డైరెక్టర్లు దేవీ శ్రీప్రసాద్‌, థమన్‌లు కూడా రాజు మృతిపట్ల నివాళి అర్పించారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు