Michael Jackson: ఊహించాడు.. అచ్చం అలాగే చనిపోయాడు!

25 Jun, 2021 08:41 IST|Sakshi

పాప్‌ రారాజు మైకేల్‌ జాక్సన్‌ చనిపోయి ఇవాళ్టికి సరిగ్గా పన్నెండేళ్లు పూర్తైంది. ఆయన చావుకు కారణం.. డ్రగ్స్‌, వాటి వల్ల వచ్చిన గుండెపోటు. యాభై ఏళ్ల వయసులో మోతాదుకు మించి తీసుకోవడం వల్లే జాక్సన్‌ గుండెపోటుకి గురై చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు కూడా. అయితే జాక్సన్‌ తన చావు భయాన్ని చాలా ఏళ్ల క్రితమే.. అది కూడా తన భార్య సమక్షంలో ప్రస్తావించడం విశేషం. 

లీసా మరీ(54) జాక్సన్‌కు మొదటి భార్య. 1994లో ఆమె జాక్సన్‌ను పెళ్లి చేసుకుని.. 1996లో వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు ఇచ్చింది. లీసా మరీ ఎవరో కాదు.. అమెరికన్‌ పాప్‌ సింగర్‌,  ‘కింగ్‌ ఆఫ్‌ రాక్‌ అండ్‌ రోల్‌’ ఎల్విస్‌ ప్రెస్లేకి ఏకైక కూతురు. లీసాకి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు ఎల్విస్‌ గుండెపోటుతో కన్నుమూశాడు. ఆ టైంలో ఎల్విస్‌ ప్రొపొఫోల్‌, బెన్జోడయాజెపైన్‌ లాంటి డ్రగ్స్ వాడాడు. విశేషం ఏంటంటే.. ఎల్విస్‌ చనిపోయిన ముప్ఫై ఏళ్ల తర్వాత జాక్సన్‌ కూడా ఇవే డ్రగ్స్‌ వాడి కన్నుమూశాడు.

 

ఇక గతంలో లీసాతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాక్సన్‌.. తన భయాన్ని పబ్లిక్‌గా వెల్లడించాడు కూడా. ఆ టైంలో జాక్సన్‌ ‘నా ఆరోగ్యం దృష్ట్యా కొన్ని మందులు వాడుతున్నా. కానీ, వికటిస్తే వీళ్ల నాన్నలా నేనూ గుండెపోటుతో చనిపోతానేమో అని భయంగా ఉంది’ అని కాకతాళీయంగా ఓ మాట అనేశాడు. ఆ ఊహకు తగ్గట్లే లాస్‌ ఏంజెల్స్‌లో 2009లో జూన్‌ 25న గుండెపోటుతో, విచిత్రంగా అవే డ్రగ్స్‌ వాడి కన్నుమూశాడు మైకేల్‌ జోసెఫ్‌ జాక్సన్‌. ఇక లీసా, జాక్సన్‌ విడిపోయాక కూడా నాలుగేళ్లపాటు రహస్యంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు వాళ్లు.  ఆ తర్వాత 1996లో డెర్మటాలజిస్ట్‌ డెబోరాను పెళ్లి చేసుకుని.. 1999లో విడాకులు ఇచ్చాడు.

చదవండి: జాక్సన్‌ బాడీ గార్డులు తోసేశారు: ఇండియన్‌ నటుడు      

మరిన్ని వార్తలు