భర్తతో విడాకులు; మళ్లీ ప్రేమలో పడ్డా: నటి

17 Jun, 2021 15:38 IST|Sakshi

ముంబై: తాను మళ్లీ ప్రేమలో పడ్డానని, ప్రస్తుత బంధంలో ఎంతో సంతోషంగా ఉన్నానంటోంది బాలీవుడ్‌ నటి మినీషా లంబా. విడాకులు తీసుకున్నంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదని, సరైన వ్యక్తి తారసపడితే సరికొత్త ఆనందాలు సొంతం చేసుకోవచ్చని పేర్కొంది. గతాన్ని మర్చిపోయి ముందుకు సాగితేనే మనశ్శాంతిగా బతకవచ్చని, తాను ప్రస్తుతం అదే పని చేస్తున్నానని చెప్పుకొచ్చింది. బచ్‌నా యే హసీనా, కిడ్నాప్‌, అనామికా, జోకర్‌ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన మినీషా లంబా.. బిగ్‌బాస్‌ 8 సీజన్‌లో పాల్గొంది. అదే విధంగా తెనాలి రామ, ఇంటర్నెట్‌ వాలా వంటి టీవీషోలలో నటించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరువైంది.

ఇక వ్యక్తిగత విషయానికొస్తే... 2015లో రియాన్‌ థామ్‌ అనే నైట్‌క్లబ్‌ యజమానిని పెళ్లాడిన మినీషా... అతడితో విభేదాలు తలెత్తిన కారణంగా 2020లో విడాకులు తీసుకుంది. ఈ నేపథ్యంలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడిన మినీషా.. ‘‘ప్రతి ఒక్కరికి సంతోషంగా జీవించే హక్కు ఉంటుంది. కానీ మన సమాజంలో విడాకులు తీసుకున్న మహిళను చిన్నచూపు చూడటం చాలా మందికి అలవాటు. అయితే, ఆధునిక మహిళలు.. ముఖ్యంగా స్వతంత్రంగా జీవించగల శక్తి గలవారు ఇందుకు వ్యతిరేకంగా తమ గళాన్ని విప్పుతున్నారు. గతంలో అయితే, వివాహ బంధాన్ని నిలుపుకోవడానికి కేవలం స్త్రీలు మాత్రమే ప్రయత్నించేవారు.. కష్టనష్టాలు భరిస్తూ.. ఎన్నో త్యాగాలు చేసేవారు. 

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. నిలబడవు అనుకున్న బంధనాల నుంచి విముక్తి పొందేందుకు వెనుకాడటం లేదు. నిజానికి విభేదాలు తారస్థాయికి చేరిన తర్వాత ఆ వివాహ బంధంలో కొనసాగటం కూడా సరికాదు. విడాకులు తీసుకోవడమే మంచిది. అయితే భర్తతో విడిపోయినంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు. నేను ప్రస్తుతం.. మంచి వ్యక్తిత్వం గల ఓ మనిషితో ప్రేమలో ఉన్నాను. నాకు మరోసారి నా ప్రేమ లభించింది’’ అని సమాజకట్టుబాట్లు, తన ఆలోచనా విధానం గురించి వివరించింది. 

చదవండి: సౌత్‌ నిర్మాత తన గదిలోకి రమ్మన్నాడు: సీనియర్‌ నటి

మరిన్ని వార్తలు