Mithun Chakraborty: భయపడిపోయాను, ఎన్నోసార్లు చావే శరణ్యం అనుకున్నా, కానీ..

24 Jul, 2022 16:14 IST|Sakshi

మిథున్‌ చక్రవర్తి.. ఎన్నో సినిమాల్లో తన నటనతో మెప్పించాడు. 80, 90 దశకాల్లో ఆయన చేసిన చిత్రాలు విశేష ఆదరణ పొందాయి. 1976లో మృగయ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆయన డిస్కో డ్యాన్సర్‌, డ్యాన్స్‌ డ్యాన్స్‌, ప్యార్‌ జుక్త నహీ, కసమ్‌ ఫాయిదా కర్నె వాలేకీ, కమాండో వంటి సినిమాలతో బాలీవుడ్‌ను ఓ ఊపు ఊపాడు. అయితే తన జీవితం ఏమీ పూలపాన్పు కాదంటున్నాడు మిథున్‌.

తాజాగా ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల గురించి చెప్పుకొచ్చాడు. 'సాధారణంగా ఇలాంటి వాటి గురించి నేను ఎక్కువగా మాట్లాడాను. నా లైఫ్‌ను మరీ అంత కష్టంగా నెట్టుకొచ్చిన సందర్భాలు కూడా పెద్దగా ఏమీ లేవు. పైగా నేను పడ్డ కష్టాలను చెప్తే నటుడిగా ఎదగాలనుకుంటున్న కొత్త తరాన్ని నేను నిరాశపర్చినట్లు అవుతుందని నా అభిప్రాయం. ప్రతి ఒక్కరూ ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. నా జీవితంలో అలాంటివి చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు నేను నా లక్ష్యాన్ని చేరుకోలేనేమోనని భయపడ్డాను, అంతేకాదు ఆ భయంతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. కానీ ఆ ఆలోచనను విరమించుకునేవాడిని. నేను మీకిచ్చే సలహా కూడా ఇదే.. ప్రాణం తీసుకోవాలన్న ఆలోచననే మానేయండి.. ప్రతిదానితో పోరాడండి. అలా పోరాడాను కాబట్టే నేనీ స్థాయిలో ఉన్నా.

రానురానూ మానవ విలువలు తగ్గిపోతున్నాయి. సోషల్‌ మీడియాను పాజిటివ్‌ అంశాలకంటే కూడా నెగెటివిటీకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు మేము షూటింగ్‌ అయిందంటే అందరం కలిసి కూర్చుని తినేవాళ్లం. కానీ ఇప్పుడు ఎవరికి వాళ్లు వ్యానిటీ వ్యాన్‌లోకి వెళ్లిపోయి ఫోన్లతో బిజీ అవుతున్నారు' అని చెప్పుకొచ్చాడు. కాగా మిథున్‌ బెంగాలీ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అవ్‌జిత్‌ సేన్‌ ప్రజాపతి సినిమాలో అతడు నటించనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: ఆ హీరో భార్య నన్ను శారీరకంగా, మానసికంగా హింసించింది: హీరోయిన్‌
కేటీఆర్‌ గారూ, కాలక్షేపం కావాలంటే ఈ షోలు చూసేయండి

మరిన్ని వార్తలు